హైదరాబాద్ : కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్డౌన్ను విధించిన విషయం విదితమే. లాక్డౌన్ వేళ ప్రజలంతా సహకరించాలి అని డీజీపీ మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొందరు రోడ్లపైకి రావడంతోనే కరోనా వ్యాప్తి చెందుతుందన్నారు. ఏ అవసరం ఉన్నా ఉదయం 6 నుంచి 10 గంటల మధ్యనే బయటకు రావాలి. ఈ నాలుగు గంటల సమయంలోనే ఈ-కామర్స్ సేవలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు. లాక్డౌన్ సమయంలో బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనాలను కూడా సీజ్ చేస్తామన్నారు. సీజ్ చేసిన వాహనాలను లాక్డౌన్ తర్వాతే అప్పగిస్తామని చెప్పారు. అత్యవసర వాహనాలకు ప్రతి చెక్ పోస్టు వద్ద ఒక ప్రత్యేక లైను ఏర్పాటు చేస్తామని డీజీపీ వెల్లడించారు.