హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): ఎస్సెస్సీ వార్షిక పరీక్షలను వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. 2022 ఫిబ్రవరి 28లోపు ప్రీ ఫైనల్ పరీక్షలు, మార్చి, ఏప్రిల్లో వార్షిక పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ ఏడాది దసరా సెలవులు వచ్చేనెల 6 నుంచి 17 వరకు 12 రోజులు ఉంటాయి. 2021- 22 విద్యాసంవత్సరానికి 1-10 తరగతుల అకడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శనివారం విడుదలచేశారు. పరీక్షల పూర్తి షెడ్యూల్ త్వరలోనే ఖరారు చేయనున్నారు. ఈ ఏడాది జూలై 1 నుంచి సెప్టెంబర్ 1 వరకు నిర్వహించిన 47 రోజుల ఆన్లైన్ తరగతులను కలుపుకొని పాఠశాలలు మొత్తం 213 రోజులు పనిచేస్తాయని ప్రకటించారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభంకాగా, 166 రోజులు ఆఫ్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. స్కూళ్లు భౌతికంగా ప్రారంభమైన సెప్టెంబర్ 1 నుంచి రీ ఓపెన్ చేసినట్టు క్యాలెండర్లో పేర్కొన్నారు. 2022 ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు ఆఖరి పని దినంగా నిర్ణయించారు. ఏప్రిల్ 24 నుంచి జూన్ 2 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తారు.
అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్థానిక ఆరోగ్య కేంద్రాల సాయంతో వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఎవరికైనా చికిత్స అవసరమైతే రెఫరల్ దవాఖానలకు తీసుకెళ్లాలని అకడమిక్ క్యాలెండర్లో సూచించారు. పిల్లల క్యుములేటివ్ రికార్డుల్లో హెల్త్ కార్డులను సైతం ముంద్రించాలని, వాటిని సక్రమంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ప్రధానోపాధ్యాయులు చొరవ తీసుకొని ఏడాదిలో రెండుసార్లు విద్యార్థులకు వైద్య పరీక్షలను నిర్వహించాలని ఆదేశించారు.