న్యూఢిల్లీ : అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం భూ కొనుగోలు వ్యవహారంలో ఆలయ ట్రస్ట్ పై వెల్లువెత్తిన ఆరోపణల నేపథ్యంలో ఇది రాముడి పేరుతో మోసం చేయడమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. సత్యం, న్యాయం అనేవి శ్రీరాముడికి మారుపేరని అంటూ రామ మందిర స్కామ్ హ్యాష్ ట్యాగ్ తో రాహుల్ సోమవారం ట్వీట్ చేశారు.
మందిర ట్రస్ట్ పై భూ కొనుగోలు వ్యవహారంలో వచ్చిన ఆరోపణలను నిగ్గుతేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేసింది. మందిర నిర్మాణం కోసం ఈ ఏడాడి మార్చి 18న రూ 2 కోట్ల విలువైన భూమిని ఏకంగా 18.5 కోట్ల వెచ్చించి ట్రస్ట్ కొనుగోలు చేసిందని కాంగ్రెస్ తో పాటు ఎస్పీ, ఆప్ లు ఆరోపిస్తున్నాయి.
ఇదే భూమిని అదే రోజున ఈ డీల్ జరిగిన కొద్ది నిమిషాల కిందటే కుసమ్ పాధక్ అనే వ్యక్తి రవి తివారీ, సుల్తాన్ అన్సారీలకు రూ 2 కోట్లకు విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. తివారీ, సుల్తాన్ ల నుంచి ఇదే భూమిని మందిర ట్రస్ట్ రూ 18.5 కోట్లు చెల్లించి సొంతం చేసుకుందని ఆయా పార్టీలు ఆరోపిస్తున్నాయి. కాగా ఈ ఆరోపణలను రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తోసిపుచ్చారు.