తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కరోనా వైరస్ వెంటాడుతోంది. ఇప్పటికే కరోనా ఎఫెక్ట్ కారణంగా కఠిన ఆంక్షల మధ్య కొద్ది మందికే దర్శన అవకాశం కల్పిస్తున్నారు. ఇటీవలే ఆలయ మాజీ ప్రధాన అర్చకులు నారాయణ దీక్షితులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. నారాయణ దీక్షితుల ఆరోగ్య పరిస్థితి విషమించి మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు నారాయణ దీక్షితులు మృతి పట్ల టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో సంతాపం ప్రకటించారు. నారాయణ దీక్షితులు మరణ వార్త తనకు ఆవేదన కలిగించిందని చెప్పారు. దశాబ్దాలపాటు ఆయన శ్రీవారి సేవలో తరించారని చైర్మన్ కొనియాడారు. శ్రీ దీక్షితులు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు శ్రీ వేంకటేశ్వర స్వామి వారు నిబ్బరం ప్రసాదించాలని కోరారు.