హైదరాబాద్ : ఆగ్నేయ దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో తెలంగాణలో పొడి వాతావరణం ఏర్పడింది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు నిలకడగా కొనసాగుతున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్లలో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.1 నుంచి 38.2 డిగ్రీల మధ్య నమోదవుతున్నట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. రాబోయే మూడురోజులు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగనున్నది. మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్లో 15.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయింది. మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్ వాతావరణం క్రమంగా వేడెక్కుతున్నది. పగటిపూటతోపాటు రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఉక్కపోస్తున్నది. శుక్రవారం నగరంలో 35.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.