హైదరాబాద్ : తెలంగాణలో ఈ నెల 27 వరకు పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే, మంగళవారం దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం బుధవారం నైరుతి పరిసర ప్రాంతాల్లోని ఆగ్నేయ బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలో మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నదని చెప్పింది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, పశ్చిమ- వాయువ్య దిశగా కదిలి శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.
అలాగే రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు ఈశాన్య దిశనుంచి గంటకు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీస్తున్నాయని తెలిపింది. రాష్ట్రంలో పొడివాతావరణం ఏర్పడడంతో రాగల మూడు రోజుల్లో ఆదిలాబాద్, సంగారెడ్డి కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 15 డిగ్రీల సెల్సీయస్కు పడిపోయే అవకాశం ఉందని టీఎస్డీపీఎస్ అంచనా వేసింది. ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అత్యల్పంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ)లో 18.6, ఖమ్మం జిల్లా పమ్మిలో అత్యధికంగా 37.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీఎస్ డీపీఎస్ పేర్కొన్నది.
జీహెచ్ఎంసీ పరిధిలోని సెంట్రల్ యూనివర్సిటీలో కనిష్ఠంగా 19.1 డిగ్రీలు, షాపూర్నగర్లో 35.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయని తెలిపింది. రాష్ట్రంలో అత్యధికంగా సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం 9.05, మంచిర్యాల జిల్లా కాసిపేటలో 8.42, సూర్యాపేట జిల్లా నూతనకల్ 6.73, పెద్దపల్లి జిల్లా కమాన్పూర్లో 4.28 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని వివరించింది.