హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): రోగి ఇంటికి ఆకాశమార్గంలో ఔషధాలను సరఫరా చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పం గురువారం కార్యరూపం దాల్చనున్నది. ప్రముఖ కొరియర్ సేవల సంస్థ బ్లూడార్ట్, డ్రోన్ డెలివరీ స్టార్టప్ ‘స్కై ఎయిర్ మొబిలిటీ’తో కలిసి ప్రభుత్వం చేపట్టిన ‘మెడిసిన్ ఫ్రమ్ స్కై’ ప్రాజెక్టు గురువారం ప్రారంభం కానున్నది. మొదటి రెండు రోజులు ‘కనిపించేంత దూరం’లోని విజువల్ లైన్ ఆఫ్ సైట్ (వీఎల్వోఎస్) లక్ష్యాలకు ఔషధాలను సరఫరా చేయనున్నారు. వీటి పరిధి బేస్ నుంచి 500-700 మీటర్ల వరకు ఉంటుంది. 11వ తేదీ నుంచి 9-10 కిలోమీటర్ల దూరంలోని సుదూర లక్ష్యాలకు (బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్-బీవీఎల్వోఎస్) అందించే సేవలు అందుబాటులోకి రానున్నాయి. దేశంలో మొదటిసారిగా బీవీఎల్వోఎస్ సేవలు ప్రారంభించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించనున్నది. తొలిదశలో ట్రయల్ రన్ కింద ఈ నెల 9 నుంచి 17వరకు వికారాబాద్లో డ్రోన్ల ద్వారా ఔషధాలు, వ్యాక్సిన్లు సరఫరా చేయనున్నారు. స్కై ఎయిర్ సహ వ్యవస్థాపకుడు జక్కంపూడి స్వాప్నిక్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగస్వాములు కావడం సంతోషంగా ఉన్నదన్నారు. తమ ప్రయోగం ఔషధాల రవాణా రంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. బ్లూడార్ట్ ఎండీ బాల్ఫోర్ ఇమానుయేల్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేయాలన్న ప్రభుత్వాల లక్ష్యాన్ని సాధించడంలో తమ టెక్నాలజీ అత్యంత కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.