హైదరాబాద్ : డ్రోన్ల ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వ్యాక్సిన్లు, మందులను సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్ట్గా వికారాబాద్లో ఈ నెల 22న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసేందుకు హైదరాబాద్ ఆధారిత ఎయిర్సర్వ్ స్టార్టప్, అటానమస్ ఏరియల్ సర్వీసెస్ సిద్ధమయ్యాయి. జిల్లాలోని మొత్తం 16 పీహెచ్సీలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. వికారాబాద్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వీసులను ప్రభుత్వం విస్తరించనుంది.
సిలికాన్ ఇండియా మ్యాగజైన్ 2021 నాటి టాప్ 10 డ్రోన్ సర్వీసు ప్రొవైడర్లలో ఎయిర్సర్వ్ ఒకటి. ‘మెడిసిన్ ఫ్రమ్ ది స్కై’ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ఏడు కన్సార్టియాలలో ఇది ఒకటి. టీకాలు, మందులు, రక్తం మొదలైన వాటి సరఫరాను నిర్వహించడానికి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వశాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పటికే అనుమతి ఇచ్చాయి.
ఎయిర్సర్వ్ డైరెక్టర్ అనికేత్ మధుసూదన్ మాట్లాడుతూ.. టీకాలు మొదలైనవాటిని సురక్షితంగా రవాణా చేయడానికి, ఉష్ణోగ్రత-నియంత్రిత మెడికల్ బాక్స్తో కూడిన యుఏవీలను తాము నిర్మించినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ రవాణా మార్గంలో భాగంగా ఈ విధానాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. మందులు, కొవిడ్ వ్యాక్సిన్లు, రక్తం, రోగనిర్ధారణ నమూనాలు, ఇతర వైద్య పరికరాలను సురక్షితంగా, ఖచ్చితంగా, నమ్మదగిన విధంగా పికప్ అండ్ డెలివరీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.