దేశ రక్షణ రంగానికి వెన్నెముకగా ఉన్న ‘రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) కరోనా మహమ్మారిపై కూడా అలుపెరుగని యుద్ధం చేస్తున్నది. వైరస్ కట్టడికి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ఆవిష్కరణలు చేసి తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నది. మొదటి వేవ్లో శానిటైజింగ్ యంత్రాలు, వెంటిలేటర్ల తయారీ, దవాఖానల నిర్మాణంపై ప్రధానంగా దృష్టి పెట్టిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు సెకండ్వేవ్లో కరోనా చికిత్సపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. డీఆర్డీవో అభివృద్ధి చేసిన 2డీజీ ఔషధం కరోనా చికిత్స తీరుతెన్నులనే మార్చివేయవచ్చని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కరోనా కట్టడికి డీఆర్డీవో ఇప్పటివరకూ చేసిన ఆవిష్కరణలు..
శానిటైజింగ్ యంత్రాలు
కరోనా వ్యాప్తి నియంత్రణకు శానిటైజింగ్ ఎంతో కీలకం. దీనిని గుర్తించిన డీఆర్డీవో పలు రకాల శానిటైజింగ్ యంత్రాలను అభివృద్ధి చేసింది.
ఆటోమెటిక్ శానిటైజర్ డిస్పెన్సర్
అగ్నిమాపక వ్యవస్థలో ఉపయోగించే మిస్ట్ టెక్నాలజీ ఆధారంగా ఆటోమెటిక్ శానిటైజర్ డిస్పెన్సర్ను అభివృద్ధి చేసింది. ఈ యంత్రం నాజిల్ కింద చేయిపెట్టగానే, సెన్సర్లు 6-8 మిల్లీలీటర్ల మేర శానిటైజర్ను స్ప్రే చేస్తాయి. అనేక కంపెనీలకు లైసెన్సులు ఇవ్వడంతో ఇవి పెద్ద ఎత్తున ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు అన్ని కంపెనీల్లో, ప్రజలు గుమిగూడే ప్రాంతాల్లో వీటిని వినియోగిస్తున్నారు.
పాకెట్ శానిటైజర్: శానిటైజర్ డబ్బాలను మోసుకెళ్లాల్సిన పని లేకుండా పాకెట్/పెన్ శానిటైజర్లను డీఆర్డీవో అందుబాటులోకి తెచ్చింది. పాకెట్ శానిటైజర్ పెర్ఫ్యూమ్ స్ప్రే మాదిరిగా ఉంటే, పెన్ శానిటైజర్ జేబులోని పెన్ను పరిమాణంలో ఉంటుంది. వీటిని రీఫిల్ చేసుకోవచ్చు.
డిస్ఇన్ఫెక్ట్ చాంబర్లు
కార్లు, బైక్లు వంటి వాహనాలను సూక్ష్మజీవి రహితం చేయడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి.
హెర్బల్ శానిటైజర్
రసాయనాలతో తయారైన శానిటైజర్ల వల్ల కొందరికి చర్మంపై దురద వంటి సమస్యలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఐసోప్రొఫైల్ ఆల్కహాల్, కలబంద రసం కలిపి డీఆర్డీవో హెర్బల్ శానిటైజర్ను అభివృద్ధి చేసింది.
యూవీ కిరణాలతో వైరస్ మటాష్
నిత్యం ఉపయోగించే ఫోన్లు, ల్యాట్టాప్లు, మాస్కులు, కరెన్సీ నోట్లు, పర్సులపై వైరస్ను నిర్మూలించేందుకు ‘ధ్రువ్’ (డిఫెన్స్ రీసెర్చ్ ఆల్ట్రావయలెట్ శానిటైజర్) పేరుతో ఓ యంత్రాన్ని డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఇది మైక్రో ఓవెన్లా ఉంటుంది. ఇందులో వస్తువులను ఉంచితే, అతినీలలోహిత కిరణాల్లో ‘సీ’ రకం కాంతి సూక్ష్మజీవులను సంహరిస్తుంది.
12 రోజుల్లో 1,000 పడకల దవాఖాన
మొదటి వేవ్లో ఢిల్లీలో పడకల కొరత ఏర్పడటంతో డీఆర్డీవో 12 రోజుల్లోనే వెయ్యి పడకల దవాఖాన నిర్మించి ఔరా అనిపించింది. ఇందులోని ఐసీయూకు చైనా సైన్యంతో ఘర్షణలో అమరుడైన తెలంగాణ బిడ్డ కర్నల్ సంతోష్బాబు పేరుపెట్టారు. యూపీలోనూ రికార్డు సమయంలో దవాఖానను డీఆర్డీవో నిర్మించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో దవాఖానలను నిర్మిస్తున్నది.
శాంపిల్ కలెక్షన్ బాక్స్, మొబైల్ టెస్టింగ్ ల్యాబ్
కరోనా సోకిన వ్యక్తిని ముట్టుకోకుండా ఆ వ్యక్తి నుంచి నమూనాలను సేకరించేందుకు వినియోగిస్తున్న శాంపిల్ కలెక్షన్ బాక్స్, మొబైల్ టెస్టింగ్ ల్యాబ్లను తయారుచేసింది కూడా డీఆర్డీవోనే.
2-డీజీ
సెకండ్ వేవ్లో ఊపిరితిత్తులపై వైరస్ నేరుగా దాడి చేసి, నష్టం కలిగిస్తుండటంతో ఎలా చికిత్స చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇలాంటి సమయంలో డీఆర్డీవో ‘2-డీఆక్సీ డీ గ్లూకోజ్’ (2డీజీ) ఔషధాన్ని అభివృద్ధి చేసింది. కరోనా రోగులు వేగంగా కోలుకోవడానికి ఇది దోహదపడుతుంది. కరోనా చికిత్సలో ఇది గొప్ప ముందంజ అని భావిస్తున్నారు.
వేగంగా వెంటిలేటర్ల ఉత్పత్తి
కరోనా మొదటివేవ్లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉండటంతో వేగంగా వెంటిలేటర్లను ఉత్పత్తి చేయగల టెక్నాలజీని డీఆర్డీవో అభివృద్ధి చేసింది. బీహెచ్ఈఎల్తో పాటు అనేక కంపెనీలకు లైసెన్సులు ఇవ్వడంతో వెంటిలేటర్ల ఉత్పత్తి పెరిగింది. అవి సెకండ్వేవ్లో బాగా ఉపయోగపడుతున్నాయి. కరోనా వార్డుల్లో సేవలను మెరుగుపరిచేందుకు రోబోలను, ఒక సిలిండర్ నుంచి ఒకేసారి ఎక్కువ మందికి ఆక్సిజన్ అందించే వ్యవస్థలను, ఇతర అనేక యంత్రాలను ఆవిష్కరించింది.
సొంతంగా యాంటీబాడీల పరీక్షకు కిట్
డీఆర్డీవో మరో అద్భుత ఆవిష్కరణ ఇది. కరోనా సోకి కోలుకున్నవారు లేదా వ్యాక్సిన్ వేసుకున్నవారిలో ఉత్పత్తయ్యే ప్రతిరక్షకాలు ఎంతకాలం ఉంటాయో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో మన శరీరంలో యాంటీబాడీలు ఉన్నాయో లేదో స్వయంగా నిర్ధారించుకొనేందుకు ‘డిప్కొవాన్’ పేరుతో టెస్టింగ్ కిట్ను డీఆర్డీవో అభివృద్ధి చేసింది. ఇది 99% కచ్చితత్వంతో పనిచేస్తుంది. దీని ధర రూ.75 మాత్రమే.