హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): కరోనా చికిత్సలో వినియోగించేందుకు డీఆర్డీవో అభివృద్ధి చేసిన ‘2-డీయాక్సీ డీ గ్లూకోజ్’ (2డీజీ) మరో వారం రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశమున్నదని డీఆర్డీవో చైర్మన్ సతీశ్రెడ్డి తెలిపారు. ఈ ఆవిష్కరణలో భాగస్వామిగా ఉన్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నుంచే ఔషధం ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. ఈ ఆవిష్కరణ కరోనా చికిత్సలో గొప్ప మైలురాయిగా నిలిచిపోతుందన్నారు. ‘2-డీజీ’ ఆవిష్కరణ సందర్భంగా సతీశ్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.
దేశం మొత్తం కరోనాతో తల్లడిల్లుతున్న సమయంలో ‘2-డీజీ’ని ఆవిష్కరించడం ఎలా అనిపిస్తున్నది?
మా బృందం ఏడాదిపాటు పడిన కష్టానికి ఫలితం దక్కింది. మా ఆవిష్కరణ వల్ల ప్రాణాలను కాపాడటమే కాదు వైద్య సిబ్బందిపై ఒత్తిడి తగ్గుతుంది.
సులభంగా వినియోగించగలిగే ఔషధం రావడంతో దేశం ఆశ్చర్యంలో మునిగిపోయింది. దీనిపై మీ స్పందన ఏమిటి?
ఈ క్రెడిట్ మొత్తం మా బృందానిదే. క్లిష్టంగా ఉన్న కొవిడ్ చికిత్సను సులభతరం చేయడం, వైరస్ వ్యాప్తి, తీవ్రతను తగ్గించే కీలక ఔషధాన్ని కనుగొనాలని ముందే నిర్ణయించుకున్నారు. దాదాపు సంవత్సరకాలం అహోరాత్రులు శ్రమించారు. రెడ్డీస్ ల్యాబ్స్ సహకరించింది. మేము ఊహించినట్టే ఫలితం వచ్చింది. సులభంగా వినియోగించేలా, వేగంగా ఉత్పత్తి చేయగలిగే ఔషధాన్ని ఆవిష్కరించగలిగాం. 2-డీజీ పొడిని నీళ్లలో కలిపి తాగితే సరిపోతుందని చెప్పగానే.. ‘కరోనా చికిత్స ఇంత సులభమా?’ అని చాలామంది ఆశ్చర్యపోతున్నట్టు మా దృష్టికి వచ్చింది.
ఇది ప్రపంచ కరోనా చరిత్రలోనే ఒక గొప్ప ఆవిష్కరణగా నిలుస్తుందని ప్రశంసలు వస్తున్నాయి. మీరేమంటారు?
కరోనా చికిత్సలో అత్యంత కీలక ఆవిష్కరణ అని మాత్రం కచ్చితంగా చెప్పగలను. రోగులు త్వరగా కోలుకోవడంతోపాటు చికిత్స వ్యయం తగ్గుతుందని అంచనా వేస్తున్నాం.
ఈ ఔషధం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతర కంపెనీలకు ఇచ్చే అవకాశం ఉందా?
ప్రస్తుతానికి మాత్రం రెడ్డీస్ ల్యాబ్స్ మాత్రమే మా భాగస్వామిగా ఉన్నది. మొదటిదశలో కంపెనీయే ఉత్పత్తి చేస్తుంది. మరో వారం రోజుల్లో మొదటి లాట్ మార్కెట్లోకి రావొచ్చు. ఇతర కంపెనీలకు లైసెన్స్ ఇవ్వడంపై భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటాం.
కరోనా కట్టడికి ఇప్పటికే అనేక యంత్రాలను, టెక్నాలజీని ఆవిష్కరించారు. ఇంకా ఎలాంటి పరిశోధనలు చేస్తున్నారు?
కొన్ని ప్రయోగాలు తుది దశలో ఉన్నాయి. వివరాలు త్వరలో వెల్లడిస్తాం. కరోనా నియంత్రణ కోసం ఏడాదిగా మేము చేసిన ఆవిష్కరణలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు 25 కంపెనీలకు లైసెన్స్లు ఇచ్చాం.
కొవిడ్ హాస్పిటళ్లను పెంచుతున్నారా?
ఇప్పటికే పలు రాష్ర్టాల్లో ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదిస్తే మరిన్ని ఏర్పాటుచేస్తాం. ఆక్సిజన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం.