ఐద్వా జాతీయ అధ్యక్షురాలు మాలినీ భట్టాచార్య
సూర్యాపేట బొడ్రాయిబజార్, సెప్టెంబర్ 25: కేంద్రంలోని బీజేపీ సర్కార్ అంబానీ, అదానీలకు కొమ్ముకాస్తూ సామాన్యులను ఇబ్బందుల పాల్జేస్తున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జాతీయ అధ్యక్షురాలు మాలినీ భట్టాచార్య ధ్వజమెత్తారు. ఐద్వా రాష్ట్ర 3వ మహాసభల సందర్భంగా శనివారం సూర్యాపేటలో నిర్వహించిన ప్రతినిధుల సభలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూరేలా కేంద్రం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. బీజేపీ మనువాద విధానాలకు వ్యతిరేకంగా మహిళా లోకం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కేంద్రం విధానాలతో దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుందని తెలిపారు.