న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ పతక జోరు కొనసాగుతున్నది. మరో రెండు రోజులు మిగిలున్న టోర్నీలో భారత్ ఇప్పటి వరకు 12 స్వర్ణాలు 7 రజతాలు, 6 కాంస్య పతకాలతో టాప్ గేర్లో దూసుకెళుతున్నది. శుక్రవారం జరిగిన 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత ద్వయం సంజీవ్ రాజ్పుత్, తేజస్విని సావంత్ 31-29తో ఉక్రెయిన్ జోడీ సెరీ కులిష్, అన్నా ఇలినాపై విజయంతో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఇదే విభాగంలో ఐశ్వరీ ప్రతాప్సింగ్ తోమర్, సునిధి చౌహాన్ జోడీ కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది. పురుషుల 50మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ టీమ్ ఈవెంట్లో నీరజ్కుమార్, స్వప్నిల్ కుశాలె, చైన్ సింగ్ త్రయం 47-25తో పసిడి పతకాన్ని దక్కించుకుంది. పురుషుల 25మీటర్ల ర్యాపిడ్ పిస్టల్లో విజయ్వీర్ సిద్ధు రజతాన్ని కైవసం చేసుకున్నాడు. పురుషుల ట్రాప్ ఫైనల్లో హైదరాబాద్ షూటర్ కైనాన్ చినాయ్ నాలుగులో నిలిచి తృటిలో పతక అవకాశాన్ని కోల్పోయాడు.