న్యూఢిల్లీ : బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, నటి తాప్సీలపై ఐటీ దాడుల నేపథ్యంలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బుధవారం మోదీ సర్కార్పై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ పాలనపై విమర్శలు గుప్పించే వీరిపై ఐటీ దాడులు జరపడం పట్ల తేజస్వి యాదవ్ విస్మయం వ్యక్తం చేశారు. ‘రాజకీయ ప్రత్యర్ధుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు తొలుత వారు ఐటీ, సీబీఐ, ఈడీ వంటి సంస్ధలను ప్రయోగిస్తారు..ఇప్పుడు నాజీ సర్కార్ తమను విమర్శించే సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టులు, ఆర్టిస్టులను వెంటాడి వేధిస్తోంద’ని ఆర్జేడీ నేత ట్వీట్ చేశారు.
కాగా అనురాగ్ కశ్యప్కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థలతో పాటు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ గ్రూపు సీఈఓ శివాశిష్ సర్కార్, తాప్సీ పన్నులపై బుధవారం ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేపట్టిన సంగతి తెలిసిందే. ముంబై, పుణేల్లోని దాదాపు 30 చోట్ల ఈ దాడులు ఏకకాలంలో సాగాయి. పన్ను ఎగవేతలకు పాల్పడి 2018లో మూసివేసిన ఫాంథమ్ ఫిల్మ్స్ ప్రమోటర్లు అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మోత్వానే, నిర్మాత వికాస్ బల్, నిర్మాత, పంపిణీదారు మధు మంతెనలపై విచారణలో భాగంగా ఈ దాడులు జరిగాయని సమాచారం. 2011లో ఏర్పాటైన పాంథమ్ ఫిల్మ్స్ బ్యానర్పై లుటేరా, క్వీన్, అగ్లీ, ఎన్హెచ్ 10, మసాన్, ఉడ్తా పంజాబ్ వంటి సినిమాలు తెరకెక్కాయి.