హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఉద్యోగ నియామకాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచేలా టీఎస్పీఎస్సీకి మరింత మెరుగులు దిద్దుతున్నారు. ఇప్పటికే సంకేతిక పరిజ్ఞానంతో నిబంధనల ప్రకారం నడుచుకుంటూ పక్కా పారదర్శకంగా నియామకాలు చేపడుతుండగా, ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని కమిషన్ను మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే కమిషన్ చైర్మన్గా డాక్టర్ బీ జనార్దన్రెడ్డి, సహా మరో ఏడుగురు సభ్యులు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. కమిషన్ తొలి సమావేశంలోనే ఆధునిక సంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఉద్యోగ నియామకాలను పారదర్శకం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ.. ప్రభుత్వ విభాగాల నుంచి స్పష్టమైన సమాచారాన్ని తెప్పించుకొనే పనిలో కమిషన్ నిమగ్నమైంది. రోస్టర్, భర్తీ విధానం సహా పలు అంశాలపై దృష్టిసారించింది. నిబంధనలు తప్పకుండా, కోర్టుకేసులకు ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నది. టీఎస్పీఎస్సీని కాలానికి అనుగుణంగా పూర్తిగా సంస్కరణల బాట పట్టించేందుకు చైర్మన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇతర రాష్ర్టాల కమిషన్ల పనితీరునూ అధ్యయనంచేస్తున్నారు. ఇందుకు ఇప్పటికే ఒక దఫా పలు రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లతో సంప్రదింపులు జరిపిన ఆయన.. పరీక్షలు, ఇంటర్వ్యూల నిర్వహణలో సంస్కరణలు చేపట్టేందుకు ఏర్పాట్లుచేస్తున్నారు. ఆయా కమిషన్లలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని, అత్యుత్తమ పద్ధతులను అనుసరించడంపై దృష్టిసారించారు.