హైదరాబాద్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్మీడియట్ పూర్తిచేసిన విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్ కోసం జూలై 1 నుంచి దోస్త్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈసారి దోస్త్ అడ్మిషన్ ప్రక్రియను అత్యంత సులభతరం చేశారు. విద్యార్థులు ఇంట్లోనుంచే రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్లు పెట్టుకొనే అవకాశం కల్పించారు. దోస్త్ నోటిఫికేషన్ను ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ మంగళవారం విడుదలచేశారు. దోస్త్ ద్వారా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని 1046 ప్రభుత్వ, ప్రైవేటు, ప్రత్యేక డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీ ఎం, డీహెచ్ఎంసీటీ, డీ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తారు. అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
మొబైల్ ఉంటే చాలు
ఈసారి దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ చాలా సులువుగా ఉండనున్నది. విద్యార్థులు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు. చేతిలో మొబైల్ ఉంటే చాలు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ ఆధార్తో అనుసంధానం అయి ఉంటే చాలు.. ఎంచక్కా ఇంట్లో నుంచే డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు పొందవచ్చు. స్మార్ట్ఫోన్లో ‘టీ యాప్ ఫోలియో’ యాప్ను ఇన్స్టాల్ చేసుకొని సెల్ఫీఫొటో ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. http://dost.cgg.gov.in వెబ్సైట్ ద్వారా కూడా ఎవరి సహాయం లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్లను పెట్టుకోవచ్చు. ఎన్సీసీ, పీహెచ్, క్యాప్ వంటి ప్రత్యేక క్యాటగిరీ వారికి యూనివర్సిటీల్లోని హెల్ప్లైన్ సెంటర్లలో నిర్ణీత తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. కాగా, మొదటి విడత రిజిస్ట్రేషన్కు రూ.200, రెండు, మూడో విడతలకు రూ.400 చెల్లించాల్సి ఉంటుంది.
వాట్సాప్ చాట్బాట్..
విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు వాట్సాప్ చాట్బాట్ ఆటో రెస్పాండర్ సౌకర్యాన్ని కల్పించారు. ఇందుకు 790100 2200 నంబర్ను విద్యార్థులు దోస్త్తో అనుసంధానించిన మొబైల్ నంబర్తో చాటింగ్ చేసి సందేహాలు తీర్చుకోవచ్చు. అంతేకాకుం డా ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్లో దోస్త్ తెలంగాణ అని టైప్చేసి అవసరమైన సమాచారాన్ని వీడియోల రూపంలో పొందవచ్చు. విద్యార్థుల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా 105 హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటుచేశారు.