హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఆంథ్రాక్స్ వ్యాధిపై ఆందోళన అవసరం లేదని వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఈ వ్యాధి పశువుల నుంచి మనుషులకు సోకే అవకాశాలు ఉన్నప్పటికీ గొర్రెలు, మేకల మాంసాన్ని బాగా ఉడికించడం వల్ల బ్యాక్టీరియా దాదాపు నశిస్తుందని చెప్తున్నారు. ఇటీవల వరంగల్లో ఒక గొర్రెల మందలో కొన్ని ఆంత్రాక్స్తో మరణించినట్టు నిర్ధారణ జరిగింది. వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమై వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. వరంగల్, పరిసర ప్రాంతాల నుంచి గొర్రెలు, మేకలు, ఇతర ఏ పశువులను జిల్లా సరిహద్దులు దాటి ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఆంథ్రాక్స్ బ్యాక్టీరియా సాధారణంగా అటవీ ప్రాంతాల్లో ఉంటుందని పీవీ నర్సింహారావు వెటర్నరీ యూనివర్సిటీ వెటర్నరీ పబ్లిక్ హెల్త్ విభాగాధిపతి డాక్టర్ అన్మోల్ విజయ్ తెలిపారు. వ్యాధి సోకిన పశువుల ముక్కు, మలమూత్రాల ద్వారా ఇది మనుషులకు సోకే అవకాశం ఉంటుందని చెప్పారు. మాంసం తినడం వల్ల వ్యాధి సోకే అవకాశాలు పెద్దగా ఉండవని స్పష్టంచేశారు.
ఇవీ లక్షణాలు
ఆంత్రాక్స్ వ్యాధి మనుషుల్లో మూడు దశల్లో ఉంటుందని డాక్టర్ విజయ్ తెలిపారు. తొలిదశలో చర్మంపై ఎర్రటి బొబ్బులు వస్తాయి. రెండోదశలో వాంతులు, విరేచనాలు అవుతాయి. మూడోదశలో న్యూమోనియాలా ఊపిరితిత్తుల సమస్య ఎదురవుతుంది అని వివరించారు. గొర్రెలు, మేకలు, పశు మాంసాన్ని బల్దియా స్టాంప్ లేకుండా కొనుగోలు చేయరాదని జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారి డాక్టర్ వకీల్సాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బల్దియా స్టాంప్ లేని మాంసాన్ని ఎవరైనా విక్రయిస్తే అధికారులకు ఫిర్యాదు చేయాలని, అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రేటర్లోని అన్ని కబేళాల్లో పశువులకు వైద్యపరీక్షలు జరిపిన తర్వాతే వధించడం జరుగుతుందని స్పష్టంచేశారు.