ఆందోళనా చెందొద్దు.. అప్రమత్తతే ముఖ్యం
హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): దగ్గు లేదు, జ్వరం లేదు, జలుబు లేదు కానీ కొవిడ్ పాజిటివ్. ఇలాంటి పరిస్థితులను ఆషామాషీగా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెప్తున్నారు. వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినప్పటికీ ఎలాంటి లక్షణాలు కనిపించడంలేదని స్పష్టంచేస్తున్నారు. వైద్యులు, అధ్యయనాలు చెప్తున్నప్రకారం కరోనా వైరస్ నేరుగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతున్నది. సాధారణ లక్షణాలు కనిపించకపోయినప్పటికీ ఊపిరితిత్తులను ధ్వంసం చేస్తున్నాయి. మొదటిదశతో పోల్చితే ఈ లక్షణం కొత్తది. పేషెంట్ వైరస్ సోకిందని గుర్తించేలోగా నష్టం చేస్తున్నది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కల్గిస్తున్నది. రెండు, మూడ్రోజుల్లోనే ఆరోగ్యం క్షీణిస్తున్నది. ఈ తరహా లక్షణాలు కొద్దిమందిలోనే ఉంటున్నాయని వైద్యులు చెప్తున్నారు. దగ్గు, జ్వరం లేకున్నా.. తలనొప్పి, కండ్లు ఎర్రగా మారడం, ఒంటినొప్పులు, డయేరియా, వీక్నెస్ వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందుగా అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటే త్వరగా కోలుకోవచ్చని పేర్కొంటున్నారు. రెండోవేవ్ కరోనాలో యువతే ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నారు. వీరిలో 80శాతం మందికి లక్షణాలు కనిపించక వైరస్ వాహకాలుగా పనిచేస్తున్నారు.