హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో దాదాపు సగం మంది కరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోయినట్టు వ్యవహరిస్తున్నారని ప్రజారోగ్య సంచాలకులు జీ శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్ నిబంధనలు పాటించడం లేదన్నారు. ప్రమాదకరమైన డెల్టా వేరియంట్ మన చుట్టూనే ఉందన్న విషయాన్ని మర్చిపోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా పాజిటివ్ వ్యక్తులు బయటతిరుగుతున్నారని వాపోయారు. పాజిటివ్గా తేలితే తప్పకుండా ఐసోలేషన్లో ఉండాలని కోరారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండో వేవ్ ప్రభావం పూర్తిగా తగ్గలేదని శ్రీనివాసరావు చెప్పారు. ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, మంచిర్యాల తదితర జిల్లాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ నియంత్రణలో ఉందని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కొద్దిగా అలసత్వం ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. రాష్ట్రంలో కొవిడ్ పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు తెలుసుకొంటున్నారని చెప్పారు. థర్డ్ వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 100కు పైగా పడకలు కలిగిన ప్రైవేటు దవాఖానలు ఆక్సిజన్ ప్లాంట్ లేదా ఆక్సిజన్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు. నెల రోజుల్లో ఏర్పాటు చేయకపోతే దవాఖానలపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 18 ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరు టీకా వేసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో రెండు డెల్టా ప్లస్ కేసులు ఉన్నట్లు శుక్రవారం కేంద్రప్రభుత్వం ప్రకటించిన విషయంపై ఆయన స్పందిస్తూ.. మే నెల మధ్యలోనే డెల్టా ప్లస్ కేసులను గుర్తించామని, ప్రస్తుతం వారు కోలుకున్నారని తెలిపారు. డెల్టా ప్లస్ పట్ల ఎలాంటి భయాందోళనలు అవసరం లేదన్నారు.