హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా సెకండ్వేవ్కు డెల్టా వేరియంట్ కారణంకాగా, ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ మూడో వేవ్కు కారణమవుతుందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మహారాష్ట్రలో అధికారులు డెల్టా ప్లస్తో థర్డ్వేవ్ ముప్పు ఉందని అక్కడి ప్రభుత్వానికి నివేదించారు. దీంతో పక్కనే ఉన్న తెలంగాణలోనూ దీని ప్రభావం ఉంటుందేమోనన్న ఆందోళన మొదలైంది. వైద్యారోగ్య నిపుణులు మాత్రం థర్డ్ వేవ్కు డెల్టా ప్లస్ కారణం కాకపోవచ్చని, పెద్దగా భయపడాల్సిన అవసరం లేదని స్పష్టంచేస్తున్నారు.
డెల్టా ముదిరి డెల్టా ప్లస్..
డెల్టా వేరియంట్ దక్షిణాఫ్రికాకు చెందిన బీటా వేరియంట్ ఆర్బిడ్ మ్యుటేషన్తో కలవడం వల్ల డెల్టా ప్లస్గా మారింది. సౌతాఫ్రికాలోని ఈ మ్యుటేషన్ వల్లనే అక్కడ వ్యాక్సిన్లను సైతం తట్టుకొని నిలిచే గుణం వైరస్కు ఎక్కువైందని అధ్యయనాల్లో తేలింది. మహారాష్ట్రలో విస్తరించిన డెల్టా వేరియంట్ ప్రమాదకరమైనదిగా గుర్తింపు పొందింది. దీనికి సౌతాఫ్రికా వేరియంట్ కలవడంతో ఏర్పడ్డ డెల్టా ప్లస్ వల్ల మరింత ప్రమాదం ఏర్పడుతుందేమోనని అందరి భయం. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 63 డెల్టా ప్లస్ శాంపిళ్లను మాత్రమే గుర్తించగా, దేశంలో కేవలం 5 మాత్రమే వెలుగుచూశాయి. ఇది ఎక్కువ కాలం ఉండి, ఎక్కువ వ్యాప్తి జరిగితేనే భయపడాలని, లేదంటే ఆందోళన అవసరం లేదని వైద్య నిపుణులు చెప్తున్నారు.
డెల్టా ప్లస్ నుంచి డెల్టా రక్షణ..
ఇప్పటికే మనదేశంలో డెల్టా వేరియంట్ రెండో వేవ్ రూపంలో వ్యాప్తించింది. తెలంగాణలోని కొవిడ్ రోగుల్లో ప్రతి ముగ్గురిలో ఒకరు డెల్టా బారిన పడ్డారు. దీంతో చాలా మందిలో డెల్టాను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు ఉత్పత్తిఅయ్యాయి. దీనికితోడు రాష్ట్రంలో ఇప్పటి వరకు 85 లక్షల మంది వ్యాక్సిన్లు తీసుకోగా, మరో 6 లక్షల మందికి కరోనా వచ్చి పోయింది. వీరందరిలో డెల్టాను ఎదుర్కొనే ప్రతి రక్షకాలు ఉన్నాయి. ఇవి కనీసం మూడు నుంచి ఆరు నెలలపాటు రక్షణ కల్పిస్తాయి. రెండోవేవ్ ఇప్పుడే ముగుస్తున్నది కాబట్టి వెంటనే థర్డ్వేవ్ వచ్చే అవకాశం ఉండదని నిపుణులు అంటున్నారు.డెల్టా వేరియంట్ నమోదుకాని దేశాల్లో నేరుగా డెల్టా ప్లస్ వ్యాపిస్తే మాత్రం దాన్ని తట్టుకునేంత శక్తి అక్కడి ప్రజల్లో ఉండకపోవచ్చని చెప్తున్నారు.