ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్.. కరోనా రెండోదశలో బాగా డిమాండ్ పెరిగిన పరికరం. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్ల్లో ఆక్సిజన్ పడకలు నిండిపోవడంతో ఇంట్లోనే ఉండి ఆక్సిజన్ చికిత్స పొందేందుకు కొవిడ్ రోగులు దీనిని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. అవసరం ఉన్నవారు, లేనివారు కూడా వీటిని కొనుగోలు చేస్తుండటంతో సాధారణ రోజుల్లో రూ.40-45వేలు ఉన్న ఐదు లీటర్ల కాన్సన్ట్రేటర్ ధర ఇప్పుడు ఏకంగా రూ.లక్షన్నర దాకా పెరిగింది. వాస్తవానికి కొవిడ్ చికిత్సలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల పాత్ర లేనేలేదని వైద్య నిపుణులు స్పష్టంచేస్తున్నారు. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోయిన కొవిడ్ రోగులకు వీటితో చికిత్స అందించడం సాధ్యమే కాదంటున్నారు. లక్షలు వెచ్చించి అనవసరంగా వీటిని కొనుగోలు చేయొద్దని సూచిస్తున్నారు. కాన్సన్ట్రేటర్లను అవగాహన లేకుండా వినియోగిస్తే బ్లాక్ఫంగస్ వంటి అనారోగ్య సమస్యలు చుట్టుకొనే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మే 25 (నమస్తే తెలంగాణ): కొవిడ్ స్వల్ప లక్షణాలుంటే బాధితుడికి ఆక్సిజన్ అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. ఆక్సిజన్ స్థాయి 93 కంటే ఎక్కువ ఉన్నవారికి అసలు కృత్రిమంగా ఆక్సిజన్ అందించాల్సిన అవసరమే లేదంటున్నారు. ఓ మోస్తరుగా వైరస్ లోడు (8-15/25 పాయింట్లు) ఉండి, ఆక్సిజన్ స్థాయి 93 కంటే దిగువకు పడిపోయినవారికి ఆక్సిజన్ అందించాల్సి వస్తుంది. ఇందుకు ఏబీజీ (ఆర్టీరియల్ బ్లడ్ గ్యాస్ టెస్ట్) పరీక్షల ద్వారా నిర్ధారించే పీఏవోటు/ఎఫ్ఐవోటు (రక్తంలోని ఆక్సిజన్ పరిమాణం/బయటి నుంచి తీసుకుంటున్న ఆక్సిజన్ పరిమాణం) దామాషా ప్రకారం ఆక్సిజన్ అందిస్తారు. ఈ దామాషా సాధారణంగా 500, అంతకుమించి ఉండాలి. 200కు లోపల ఉంటే ఆక్సిజన్ ఇచ్చే పరిమాణాన్ని పెంచుతారు. 200-300 వరకు ఉంటే ముందుగా నిమిషానికి 3-4 లీటర్ల ఆక్సిజన్ ఇస్తారు. ఆపై దాన్ని నెమ్మదిగా పెంచుతారు. ఓ మోస్తరు వైరస్ లోడు ఉన్నవారికి కూడా నిమిషానికి 5-10 లీటర్ల ఆక్సిజన్ను మాస్కు ద్వారా అందించాల్సి ఉంటుంది. దామాషా 200 కంటే తక్కువ ఉంటే వెంచూరి మాస్కు ద్వారా పది లీటర్ల ఆక్సిజన్ పూర్తిస్థాయిలో అందిస్తారు. 150 వరకు రీబ్రీథింగ్ కవర్ ద్వారా (మాస్కుల ద్వారా రోగి తాను వదిలిన కార్బన్డైయాక్సైడ్ను కూడా తిరిగి పీల్చుతాడు. రీబ్రీథింగ్ కవర్ వినియోగిస్తే కార్బన్డైయాక్సైడ్ను వేరు చేస్తుంది) నిమిషానికి 15 లీటర్ల వరకు ఆక్సిజన్ అందిస్తారు. వంద కంటే తక్కువ ఉంటే మాత్రం చాలా క్రిటికల్ కేసు. ఈ పరిస్థితుల్లో సీపాప్ (నాన్ ఇంటెన్సివ్ వెంటిలేటర్), పరిస్థితి ఇంకా ఆందోళనకరంగా ఉంటే వెంటిలేటర్ (ఇంటెన్సివ్) ద్వారా నిమిషానికి కనిష్ఠంగా 40 లీటర్ల ఆక్సిజన్ రోగికి అందించాల్సి ఉంటుంది.
ప్రస్తుతం మార్కెట్లో 5, 10 లీటర్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తిస్థాయి సామర్థ్యంతో వినియోగించరాదని బయో ఇంజినీర్స్ చెప్తున్నారు. ఐదు లీటర్ల కాన్సన్ట్రేటర్ నుంచి నిమిషానికి గరిష్ఠంగా 4 లీటర్ల ఆక్సిజన్ పొందేలా సెట్ చేసుకుంటేనే 92-93% స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. పది లీటర్ల కాన్సన్ట్రేటర్ నుంచి గరిష్ఠంగా 7-8 లీటర్లు పొందితేనే నిర్ణీత ప్రమాణాల మేరకు స్వచ్ఛమైన ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. అంటే మోస్తరుగా వైరస్ లోడు ఉన్న రోగి మొదలు పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారి వరకు ఏ దశలోనూ కాన్సన్ట్రేటర్ల ద్వారా రోగికి ఆక్సిజన్ అందించడం సాధ్యంకాదు. పైగా ప్రెషర్ కూడా సరిపోదు. వీటిని రోగి దీర్ఘకాలంపాటు రికవరీలో ఉంటనే వైద్యులు సూచిస్తారు. వ్యాధి తగ్గినా ఊపిరితిత్తులు రికవరీ కాకుంటే సాధారణ స్థితికి వచ్చేవరకు 2-3 నెలల సమయం పడుతుంది. ఇలాంటివారు ఇంట్లోనే ఉంటూ రికవరీ అయ్యేందుకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సూచిస్తారు.
దవాఖానల్లో అందించే ఆక్సిజన్కు ఇది ప్రత్యామ్నాయమని భ్రమపడి సొంత నిర్ణయంతో వీటిని వినియోగిస్తే ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాన్సన్ట్రేటర్లలోని ఫిల్టర్లు చెడిపోతే స్వచ్ఛమైన ఆక్సిజన్ అందదు. దీనిలోని హ్యుమిడిఫయర్లో వాడే నీటిలో ఏమైనా కలుషితాలుంటే అవి నేరుగా రోగి ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. ఫంగస్లు లోపలికి వెళితే బ్లాక్ ఫంగస్లాంటి ప్రమాదకర జబ్బులు కొనితెచ్చుకున్నట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చాలామంది గుడ్డిగా కాన్సన్ట్రేటర్లు కొంటున్నారు. వీటి వినియోగం ఎలా ఉంటుంది? ఎలాంటి పరిస్థితుల్లో వాడాలి? అనే కనీస అవగాహన ఉండటంలేదు. దవాఖానల్లో ఆక్సిజన్ పడకల కొరత ఉన్నందున ఇంట్లోనే ఆక్సిజన్ పొందవచ్చని భ్రమ పడుతున్నారు. ఇది ప్రమాదం. రికవరీలో భాగంగా వైద్యులు సూచించిన వారు.. అందునా మధుమేహం, రక్తపోటు లేనివారు మాత్రమే వీటిని ఇంట్లో వాడాలి.
–రవిశంకర్, బయో మెడికల్ విభాగం జనరల్ మేనేజర్, కేర్ హాస్పిటల్
వైద్యులు సూచిస్తేనే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను వాడాలి. కొవిడ్ రోగికి సీటీ స్కాన్ చేసి, ఆక్సిజన్ అవసరమా? లేదా? అనేది నిర్ధారిస్తారు. పాజిటివ్ వచ్చిన తర్వాత ఆక్సిజన్ అందించాల్సి వస్తే దవాఖానలో చేర్చి పైపుల ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ అందిస్తారు. అక్కడ తగ్గి ఇంటికి వెళ్లిన తర్వాత అవసరమనుకుంటేనే కాన్సన్ట్రేటర్లను సూచిస్తారు. అంతేగానీ కరోనా వచ్చిందని ప్రారంభంలోనే కాన్సన్ట్రేటర్లను వాడొద్దు.
–డాక్టర్ టీ ప్రభాకర్, నోడల్ అధికారి, గాంధీ దవాఖాన
కొవిడ్ రోగుల చికిత్సలో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను వినియోగించడం సాంకేతికంగా సాధ్యంకాదు. సిలిండర్ల ద్వారా ప్రెషర్తోనే రోగికి ఆక్సిజన్ అందించాలి. సొంత వైద్యంతో ప్రాణానికే ప్రమాదం. వ్యాధి నయమైన రోగి ఊపిరితిత్తులు సాధారణ స్థితికి చేరేవరకు దవాఖానలో ఉంచొద్దనే ఉద్దేశంతో ఇంట్లోనే ఉండాలని సూచిస్తాం. వారికి కొంత మోతాదులో ఆక్సిజన్ అవసరమున్నందున కాన్సన్ట్రేటర్లను సూచిస్తామేగానీ ఎవరుపడితే వాళ్లు ఇష్టానుసారంగా వీటిని వినియోగించడం శ్రేయస్కరం కాదు.
–డాక్టర్ కిరణ్ మాడాల, క్రిటికల్ కేర్ వైద్య నిపుణులు, నిజామాబాద్