యువతకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర సూచన
పెనుబల్లి, జూలై 18: యువత దళారులను నమ్మి మోసపోవద్దని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గంగదేవిపాడులో నాగేశ్వరరావు అనే యువకుడి ఆత్మహత్యను ప్రభుత్వానికి అంటగట్టడం సరికాదన్నారు. ఆదివారం వారి కుటుంబసభ్యులను పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నాగేశ్వరరావు ఓ దళారిని నమ్మి రూ.5 లక్షలు ఇచ్చాడని, ఉద్యోగం రాకపోవడం, ఇచ్చిన డబ్బు తిరిగిరాకపోవడంతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.