ప్రాజెక్టుల కింద నిర్వహణ వ్యవస్థ పటిష్టపర్చాలి
కాలువలు, డిస్ట్రిబ్యూటరీలను నిత్యం పర్యవేక్షించాలి
ఆపరేషన్, మెయింటనెన్స్పై సమగ్ర చార్ట్ ఉండాలి
పాలమూరు-కల్వకుర్తి సమీక్షలో సీఎం కేసీఆర్
ఆర్డీఎస్ కోసం అవసరమైతే కర్ణాటక వెళ్తానని వెల్లడి
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీగా నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులను సమర్థంగా వినియోగించుకోవాలంటే వాటి నిర్వహణ పటిష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. నీటిపారుదలశాఖ ఓఅండ్ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) వ్యవస్థను మరింత పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. బరాజ్ల నుంచి చివరి డిస్ట్రిబ్యూటరీ కెనాల్దాకా, నదుల నుంచి చివరి ఆయకట్టు దాకా నీటిని తీసుకెళ్లే అన్ని వ్యవస్థలను మెరుగుపర్చాలన్నారు. వీటిని నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. సమస్యలేమైనా ఉంటే తక్షణమే పరిష్కరించుకుంటూ నీటిపారుదలను సక్రమంగా నిర్వహించాలన్నారు. మరమత్తుల కోసం రెండు పంటల నడుమ ఖాళీ సమయాన్ని వినియోగించుకోవాలని సూచించారు. పాలమూరు- కల్వకుర్తి- జూరాల అనుసంధానం, నిర్మాణాల విస్తరణపై మూడోరోజు బుధవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ‘నేడు తెలంగాణకు నీటిపారుదల శాఖ లైఫ్లైన్గా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, కాలువల వ్యవహారం ఆంధ్రా వ్యవహారం అన్నట్టు సాగింది. నేడు పరిస్థితి పూర్తిగా మారింది. ఈ యాసంగిలోనే తెలంగాణ 52 లక్షల ఎకరాలకుపైగా పంటలు సాగుచేస్తూ, వరిపంటలో దేశంలోనే నెంబర్ వన్గా నిలిచింది. మనకు పంటలే పండవు అని తక్కువ చేసి మాట్లాడిన పక్క రాష్ట్రం నేడు మూడోస్థానంలో ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలో మన ఇంజినీర్లకు అంతగా అవగాహన కల్పించలేదు. ఇప్పుడు ఆ అవసరం పెరిగింది. ప్రతి కిందిస్థాయి ఇంజినీర్కు ఇరిగేషన్ వ్యవస్థమీద మరింతగా కమాండింగ్ రావాల్సిన అవసరమున్నది’ అని సీఎం అన్నారు.
మరింత పనివిభజన జరగాలి..
నీటిపారుదలశాఖలో పని విభజన మరింత పెరుగాల్సిన అవసరం ఉన్నదని సీఎం అన్నారు. క్రమం తప్పకుండా వర్క్షాప్లు నిర్వహించి ఓఅండ్ఎంపై ఇంజినీర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. ఓఅండ్ఎంకు ప్రత్యేక అధికారులను నియమిస్తామని చెప్పారు. సాగునీటి కాలువలు చెత్తా చెదారం లేకుండా అద్దంలా మెరువాలని స్పష్టంచేశారు. రాష్ట్ర రైతులకు ఎలాంటి సాగునీటి కష్టాలు రాకుండా చేయడమే తన ఉద్దేశమన్నారు. రాష్టంలో బరాజ్లు ఎన్ని? గేట్లెన్ని? పంపులెన్ని? కాలువలెన్ని? వాటి పొడవెంత? తదితర విషయాలపై సవివరమైన చార్టులు రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్లో సీఈలు, ఎస్ఈల స్థాయిలో వర్క్షాప్ నిర్వహించాలని, మంచి వక్తలతో క్షేత్రస్థాయి ఇంజినీర్లకు శిక్షణ ఇవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు. వ్యవసాయశాఖలో పని అధికంగా ఉంటుందని, పంపులు మోటర్లు ఒక భాగంగా, గేట్లు ప్రాజెక్టులు, కాలువలు మరో భాగంగా విభజించుకొని ఓఅండ్ఎం నిర్వహించాలని ఆదేశించారు. ఈ శిక్షణా కార్యక్రమానికి ఒకరోజు తాను కూడా హాజరవుతానని సీఎం తెలిపారు. పాలమూరు ఎత్తిపోతలకు సంబంధించిన రిజర్వాయర్లు, కాలువల నిర్మాణ ప్రదేశాలను డిజిటల్ స్క్రీన్ మీద సీఎం పరిశీలించారు.
డిస్ట్రిబ్యూటరీ కాలువల రూట్ల గుర్తింపు..
కరివెన రిజర్వాయర్ నుంచి జూరాలకు నీటిని తరలించే ప్రధాన, డిస్ట్రిబ్యూటరీ కాలువల రూట్లను సీఎం సమీక్షంలో గుర్తించారు. ఉద్దండాపూర్ నుంచి కొడంగల్, నారాయణపేట, తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగునీటిని తరలించే కాలువల రూట్లపై చర్చించారు. సాధ్యమైనంత ఎక్కువ భూమికి నీరందేలా కాలువల ఎత్తును నిర్ధారించుకోవాలని సూచించారు. గ్రావిటీ ద్వారా నీటిని తరలించే సాంకేతికతను మరింత లోతుగా పరిశీలించాలని సీఎం ఆదేశించారు. గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలో దాదాపు 88 వేల ఎకరాలకు సాగునీరందించే ఆర్డీఎస్ స్కీం పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన ఆర్డీఎస్ నుంచి తెలంగాణకు హక్కుగా రావాల్సిన 15.9 టీఎంసీల నీటిని సాధించుకుందామని, అందుకోసం అవసరమైతే తాను స్వయంగా వెళ్లి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడుతానని స్పష్టంచేశారు. సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, మహేశ్వర్రెడ్డి, ఆల వెంకటేశ్వర్రెడ్డి, గువ్వల బాలరాజు, కాలె యాదయ్య, రాజేందర్రెడ్డి, నరేందర్రెడ్డి, జైపాల్యాదవ్, మెతుకు ఆనంద్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్రావు, సలహాదారు పెంటారెడ్డి, సీఈలు రమేశ్, హమీద్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.