ప్రైవేటీకరణ దిశగా బీజేపీ సర్కారు అడుగులు
లాభాల సంస్థను కార్పొరేట్కు కట్టబెట్టే ప్రయత్నాలు
ఇదే జరిగితే పాలసీదారుల ప్రయోజనాలకు విఘాతం!
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు
మండిపడుతున్న పాలసీదారులు, ఉద్యోగులు, ఏజెంట్లు
జగిత్యాల, మార్చి 23 (నమస్తే తెలంగాణ): అది దేశంలోనే అతి పెద్ద బీమా కంపెనీ. ఐదున్నర దశాబ్దాల చరిత్ర. సామాన్యుడి నుంచి మొదలు కొని అసామాన్యుడి దాకా అందరి జీవితాల్లోనూ చెరగని ముద్ర. మనిషి బతికున్నప్పుడే కాదు, లోకం విడిచివెళ్లిన తర్వాత కుటుంబాలకు అండగా నిలిచి, ప్రతి గడపకూ, ప్రతి మనిషికీ చేరిన మహోన్నత సంస్థ. అదే మన జీవిత బీమా సంస్థ (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా). ఇప్పుడు ఆ ఎల్ఐసీపై ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్నది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కుప్పకూలే ప్రమాదం పొంచి ఉన్నది. దేశ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషిస్తూ, పాలసీదారుల సంక్షేమానికి నమ్మకంగా సేవలందించిన సంస్థను ప్రైవేట్ శక్తుల చేతుల్లో పెట్టేందుకు జరుగుతున్న పరిణామాలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతున్నది.
స్వతంత్ర భారత బీమా సంస్థల్లో ఒక నమ్మకమైన, ప్రభుత్వ రంగ సంస్థగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) అవతరించింది. 1956లో ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ ఆఫ్ 1956ని కేంద్రం జారీ చేయగా, ఈ చ ట్టం ద్వారా అప్పటికి మనుగడలో ఉన్న 245 బీమా కంపెనీలతో కలిపి సంస్థ ఏర్పడింది. అప్పు డు కేంద్రం ఎల్ఐసీలో 5 కోట్ల పెట్టుబడులు పెట్టింది. సంస్థ సేవలను దేశంలోని ప్రతి గ్రామానికీ విస్తరించాలని, సాధారణ ప్రజల నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరినీ పాలసీదారులుగా మార్చాలని సూచించింది. ఎల్ఐసీ ఏటా తన లాభాల్లో 5 శాతం లాభాలను కేంద్రానికి ఇవ్వాలని, 95 శాతం లాభాలను పాలసీదారులకు వినియోగించాలని ఆదేశించింది. అలాగే, పాలసీదారులకు సావర్నిటీ గ్యారెంటీ (సార్వభౌమాధికార హామీ) ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
ఆకాశమంత ఎత్తుకు..
1956లో ప్రస్థానం ప్రారంభమైన ఎల్ఐసీ, శాఖోపశాఖలుగా విస్తరించింది. లక్షల బ్రాంచ్లను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 40 కోట్ల మందికి పైగా పాలసీదారులు ఉన్నారు. 130 కోట్ల దేశ జనాభాలో 80 కోట్ల మంది ఆర్థిక ఉత్పాదక సామర్థ్యం కలిగి ఉన్నవారిగా భావిస్తే.. అందులో 50 శాతం మంది పాలసీదారులుగా ఉన్నారు. 31,14,496 కోట్ల లైఫ్ ఫండ్స్, 31,96,214 కోట్ల ఆస్తులను ఎల్ఐసీ సంపాదించుకుంది. 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. విదేశీ పెట్టుబడులతో ప్రైవేట్ బీమా కంపెనీలకు అనుమతిని ఇచ్చింది. 2000 సంవత్సరంలో ప్రైవేట్ బీమా సంస్థలు పెద్ద సంఖ్యలో దేశ మార్కెట్లోకి ప్రవేశించినా పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. అందులో చాలా కంపెనీలు మూతపడిపోయాయి. ఇప్పటికీ దేశంలోని బీమా సంస్థ మొత్తంలో ప్రైవేట్ బీమా సంస్థలన్నీ కలిసి కనీసం పాతిక శాతం వాటాను సైతం పొందలేకపోయాయి. ఇప్పటికీ బీమా రంగంలో ఎల్ఐసీ 75 శాతం వాటాను కొనసాగిస్తూనే వస్తున్నది. ప్రైవేట్ కంపెనీలను బీమా రంగంలోకి అనుమతించడం వల్ల ఉపాధి అవకాశాలను సైతం అనుకున్న స్థాయిలో పెంచలేకపోయారు.
ఆది నుంచీ కేంద్రానికి అండ..
కేంద్ర ప్రభుత్వానికి నిధుల విషయంలో మొదటి నుంచి ఎల్ఐసీ అండగా నిలబడింది. ప్రతి పంచవర్ష ప్రణాళికకు పెద్ద మొత్తంలో పెట్టుబడులను అందిస్తూ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వానికి 24,01,457 లక్షల కోట్ల పెట్టుబడిని అందించింది. అలాగే, కేంద్ర ప్రభుత్వం 1956లో పెట్టిన 5 కోట్ల పెట్టుబడికి ఇప్పటి వరకు 20 వేల కోట్ల డివిడెంట్ను ఎల్ఐసీ చెల్లించింది. ప్రైవేట్ కంపెనీలు బీమా రంగంలోకి ప్రవేశించిన 2000 సంవత్సరం తర్వాత ఈ రెండు దశాబ్దాల కాలంలో లక్షల కోట్ల రూపాయ ల పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వానికి అందించిం ది. అదే సమయంలో దాదాపు 10వేల కోట్ల రూ పాయల డివిడెంట్ను కేంద్రానికి చెల్లించింది. లక్షన్నర మంది ఉద్యోగులకు నెలనెలా వేలాది రూపాయల వేతనాలు ఇస్తున్న సంస్థ, వారి ఉద్యోగుల వేతనాల ద్వారా నమ్మకమైన, క్రమానుగతమైన ఇన్కం ట్యాక్స్ను కేంద్రానికి చెల్లించేలా చూసింది. అలాగే, పాలసీలపై వ్యాట్, ఇన్కమ్ ట్యాక్స్లను పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి చెల్లించింది. అదే ఈ రెండు దశాబ్దాల కాలంలో ప్రైవేట్ బీమా కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి డివిడెంట్ను, పెట్టుబడులను అందించలేకపోయాయి.
కరీంనగర్ డివిజన్ జనాభాలో 50 శాతం పాలసీదారులే..
జాతీయ స్థాయిలోనే కాదు, స్థానికంగా సైతం బీమా విషయంలో సంస్థ కీలక పాత్ర పోషిస్తుంది. ఎల్ఐసీ కరీంనగర్ డివిజన్ పరిధిలోని రెండు ఉమ్మడి జిల్లాల్లో 50 శాతం జనాభాను పాలసీదారులుగా కలిగి ఉంది. కరీంనగర్ డివిజన్ కింద కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. రెండు జిల్లాల్లో కలిపి ప్రస్తుతం 20,60,516 మంది పాలసీదారులు భాగస్వాములుగా ఉన్నారు. అలాగే, డివిజన్ పరిధిలో క్లాస్ వన్ నుంచి క్లాస్ త్రీ వరకు మూడు కేటగిరీల్లో 500కు పై చిలుకు ఉద్యోగులు సేవలందిస్తున్నారు. ఇక 8 వేల మంది ఏజెంట్లు పాలసీ సేకరణ ద్వారా ఉపాధిని పొందుతున్నారు.
ప్రైవేటీకరణ ప్రమాదం
ఐదున్నర దశాబ్దాల విజయవంతమైన ప్రస్థానం తర్వాత ఎల్ఐసీ ప్రైవేటీకరణ ప్రమాదపుటంచుల్లోకి వెళ్తున్నది. ఒకప్పుడు ప్రైవేట్ కంపెనీలన్నింటినీ జాతీయం చేసి, ప్రభుత్వ రంగ సంస్థగా మార్చిన బీమా రంగాన్ని మళ్లీ ప్రైవేట్ వ్యవస్థల్లోకి పంపించేందుకు కేంద్రం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పెట్టుబడులను సమకూర్చుకునే పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎల్ఐసీలో వాటాలను విక్రయించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది. సంస్థలో 25 శాతం వాటాను విక్రయిస్తే 2.50 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను ఒకేసారి సంపాదించాలని యోచిస్తున్నది. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పెట్టుబడుల ఉపసంహరణతో ఎల్ఐసీలోకి ప్రైవేట్ కంపెనీలు వచ్చి చేరుతాయి. ఇవి భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వానికి పెట్టుబడులను, లాభాలను అందించేందుకు అంగీకరించని పరిస్థితి నెలకొంటుంది. దీని ప్రభావం కేంద్ర ప్రభుత్వంపైనా, దేశ ప్రజలపైనా ప్రభావం చూపుతుంది. అలాగే ప్రైవేట్ కంపెనీలు ప్రవేశించడంతో కేంద్ర ప్రభుత్వం ద్వారా పాలసీదారులకు లభించిన సావర్నిటీ గ్యారెంటీ నిలిచిపోతుంది. కాలక్రమంలో ఎల్ఐసీలో వాటాలను ప్రభుత్వం ఉప సంహరించుకొని, ప్రైవేట్ సంస్థల వాటాలు పెరిగితే పాలసీదారులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇప్పటి వరకు పాలసీదారులకు, ప్రభుత్వానికి లభించిన లబ్ధి భవిష్యత్తులో ప్రైవేట్ కంపెనీల పరం అవుతుంది.