గువాహటి: అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ మజులీ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సోనోవాల్ ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసోంలో తొలి విడుత పోలింగ్ జరిగే స్థానాలకు నామినేషన్ దాఖలు గడువు నేటితో ముగియనుంది. దాంతో నామినేషన్ దాఖలుకు చివరిరోజైన మంగళవారం అసోం సీఎం తన నామినేషన్ సమర్పించారు.
బీజేపీ కార్యకర్తలు, అనుచరులతో ర్యాలీగా మజులీ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన సోనోవాల్ అక్కడి డిప్యూటీ కమిషనర్ విక్రమ్ కైరీకి తన నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు భారీ ర్యాలీ నిర్వహించిన ఆయన ఆ ర్యాలీకి హాజరైన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. మజులీ ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. మళ్లీ అవకాశమిస్తే ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన చెప్పారు.