హైదరాబాద్ : నేషనల్ డాక్టర్స్ డేను పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన ప్రముఖ వైద్యులు, వైద్య నిపుణులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గురువారం ఉదయం 7 గంటలకు ఫిల్మ్ నగర్లోని సాయిబాబా దేవాలయం దగ్గరలోని చిల్డ్రన్ పార్క్లో వైద్యులు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్తో కలిసి మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో డైరక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేష్ రెడ్డి, ప్రజారోగ్యశాఖ డైరక్టర్ జి. శ్రీనివాస రావు, సీఎం ఓఎస్టీ గంగాధర్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు, ఉస్మానియా సూపరింటెండెంట్ నాగేందర్, నిమ్స్ ఆస్పత్రి డైరక్టర్ మనోహర్, అలిమేలు (నీలోఫర్ ఆస్పత్రి), పద్మజా (నిమ్స్ ఆస్పత్రి), ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఎఎన్యు ఆస్పత్రులు, అపోలో, కాంటినెంటల్, కిమ్స్, మెడికవర్, రెయిన్ బో, సన్ షైన్, విరించి, యశోదా దవాఖానలకు చెందిన పలువురు వైద్య నిపుణులు పాల్గొని మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. డాక్టర్స్ డే రోజు 60 మంది ప్రముఖ వైద్యులు ఒకే వేదిక వద్దకు వచ్చి మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమం గతంలో ఎన్నడూ జరగలేదన్నారు. ఎందరికో ఇది స్ఫూర్తిదాయకమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం విధిగా భావించాలని, భావి భారత పౌరులకు గ్రీన్ ఇండియాను అందించడం మన బాధ్యత అన్నారు. కరోనా కష్ట కాలంలో ఆక్సిజన్ విలువ మనం తెలుసుకున్నాము. ప్రకృతిని మనం కాపాడుకోవడం ఎంతో అవసరం అని చెప్పారు.
డీఎంఈ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. పచ్చదనం తగ్గటం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయని, మొక్కలు పెంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ గొప్ప కార్యక్రమం ప్రారంభించి, చిత్తశుద్ధితో కొనసాగించడం గొప్ప విషయం అన్నారు.
డీహెచ్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. గొప్ప కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్కు అభినందనలు తెలిపారు. మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు. శుభకార్యం ఏదైనా ఒక మొక్క నాటాలన్నారు.
సీఎం ఓఎస్డీ గంగాధర్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఆక్సిజన్ విలువ ప్రతి ఒక్కరికీ తెలిసిందని, ప్రపంచంలో ఆక్సిజన్ పెరిగేలా మొక్కలు నాటి కృషి చేయాలన్నారు.
యశోద ఎండీలు జి సురేందర్ రావు, ఎంవీ రావు మాట్లాడుతూ.. మొక్కలు ప్రాణకోటికి జీవనాధారం అన్నారు. సంతోష్ కుమార్ గొప్ప దేశ సేవ చేస్తున్నారన్నారు. ఏఐజి ఎండి నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, ప్రకృతి రుణం తీర్చుకోవాలన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రపంచానికి ఆదర్శం అన్నారు. స్టార్ హాస్పిటల్ ఎండీ ఎం గోపీచంద్ మాట్లాడుతూ.. డాక్టర్స్ డే రోజు గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కిమ్స్ ఎండి భాస్కర్ రావు, రెయిన్బో ఎండీలు రమేష్ కంచర్ల, దినేష్ కంచర్ల, సన్ షైన్ ఎండి గురువా రెడ్డి, ప్రముఖ వైద్యులు సంజయ్ కల్వకుంట్ల, గోపాల్, ప్రీతి కే శుక్ల, శాస్త్రి, ఉమేష్, రితా, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.