ఖమ్మం సిటీ, ఏప్రిల్ 1: డీసీసీబీ మాజీ చైర్మన్ మువ్వా విజయ్బాబు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ జరిపించాలని ఆత్మ మాజీ చైర్మన్ నున్నా రామకృష్ణ డిమాండ్ చేశారు. ఖమ్మం ప్రెస్క్లబ్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రితంసారి పెనుబల్లి సొసైటీ డైరెక్టర్గా ఉంటూ మువ్వా సొంతూరులో బినామీ పేర్లతో, నకిలీ పహణీలతో 300 మంది లబ్ధిదారుల పేర్ల మీద అతడి బావమరిది, భార్య, ఇతర బంధువులు కలిపి రూ.3 కోట్లు రుణం పొంది రుణమాఫీ చేయించుకున్నారని ఆరోపించారు. సెల్ఫోన్ల సాకుతో రూ.10 వేలు వసూలు చేసి రూ.4 వేల ఖరీదుచేసే ఫోన్లు ఇచ్చారని అన్నారు. తైవాన్ పంపుల పంపిణీ కోసం రూ.12 వేలు మంజూరు చేసి రూ.3 వేల విలువ చేసే నాసిరకమైన వాటిని రైతులకు అంటగట్టారని ఆరోపించారు. ఉమ్మడి జిల్లాలో అవసరమైన ఫర్నీచర్, ఇంటీరియర్, ఏటీఎం, రూమ్లు, స్టేషనరీ వంటి వస్తువులన్నింటికీ బినామీ కాంట్రాక్టర్ల పేర్లు పెట్టుకుని టెండర్ దాఖలు చేయకుండానే డీసీసీబీ సొమ్మును స్వాహా చేశారని అన్నారు. నాబార్డు ద్వారా మువ్వా, పీఏ ఆంజనేయరెడ్డి బినామీ పేర్ల మీదనే కోళ్లఫారాలు ఏర్పాటుచేసి 80 శాతం సబ్సిడీ పొందారన్నారు. ఒక్కో జీఎల్జీ గ్రూపునకు రూ.లక్ష రుణం మంజూరుచేసి కేవలం రూ.50 వేలు మాత్రమే చెల్లించి మిగిలిన వాటిని బ్యాంకులో జమ చేసుకున్నారని, ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేయగా ఆ సొమ్మును సభ్యులకు ఇవ్వలేదని వెల్లడించారు. గేదెల రుణాలు, పంట రుణాల బీమా తదితర అంశాల్లో రూ.కోట్లు దండుకున్నారని ధ్వజమెత్తారు. మాజీ చైర్మన్ మువ్వా అతడి భార్య పేరుమీద రూ.50 లక్షలు రుణం తీసుకున్నారని, ఎన్నికల సమయంలో డిఫాల్టర్ అవుతాననే భయంతో అర్ధరాత్రి లెడ్జర్ బుక్లో వేరే లోన్గా మార్చుకున్నారని ఆరోపించారు. రైతుల ఖాతాల నుంచి రూ.10 కోట్లు దారి మళ్లించారని, ట్రస్టును తయారు చేసి అతనే చైర్మన్గా వ్యవహరించి రూ.కోట్లు స్వాహాచేశారని అన్నారు. టీఆర్ఎస్ అధిష్టానం సైతం స్పందించి మువ్వాను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విజ్ఞప్తి చేశారు.