పంచాయతీరాజ్ కార్యదర్శులతో మంత్రి ఎర్రబెల్లి
హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): పంచాయతీ కార్యదర్శులు మరింత ఉత్సాహంగా పనిచేయాలని, గ్రామంలో పెండింగ్ పనులను పూర్తిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. బుధవారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘం నాయకులు మంత్రి ఎర్రబెల్లిని కలిసి తమ వేతనాన్ని రూ.28,719కి పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఖజానాపై భారం పడుతున్నా వేతనాన్ని సీఎం కేసీఆర్ భారీగా పెంచారని ఎర్రబెల్లి చెప్పారు. మంత్రిని కలిసినవారిలో జూనియర్ పంచాయతీరాజ్ కార్యదర్శుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గౌరినేని రాజేశ్వర్, సంఘం బాధ్యులు శశిధర్గౌడ్, నరేశ్, మల్లికార్జున్, రమేశ్ తదితరులు ఉన్నారు.