ఆదిలాబాద్ :
ప్రకృతి సమతుల్యతను గ్రహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రకృతితో మన సంబంధాన్ని పునరాలోచించుకోవడానికి ఇదే సరైన సమయం అన్నారు. లేకపోతే భవిష్యత్తులో గాలి, నీరు దొరకని పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.
మనల్ని మనం రక్షించుకోవడానికిగాను, మనం భూగ్రహాన్ని రక్షించుకోవాలని తెలిపారు. పర్యావరణం బాగుండాలంటే గాలి, నీరు, చెట్లు సంవృద్ధిగా ఉండాలని పేర్కొన్నారు. భూమిపై కనీసం 33శాతం అటవీ ప్రాంతం ఉంటేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందనన్నారు.
అందుకే తెలంగాణ ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు. ప్రతి ఒక్కరు తమ పుట్టిన రోజు సందర్భంగా విధిగా ఒక మొక్కను నాటి అందరికి స్ఫూర్తిదాయకంగా నిలవాలని మంత్రి సూచించారు.