రియో డిజనారో : బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో చిక్కుల్లో పడ్డారు. భారత్కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాల కోసం చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు బొల్సనారోపై వత్తిళ్లు పెరిగాయి. కోవాగ్జిన్ టీకాలను కొనుగోలు చేసేందుకు ఫిబ్రవరిలో బ్రెజిల్ ఆరోగ్యశాఖ ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ దేశంలో కోవాగ్జిన్ టీకాలను ప్రెసికా మెడికోమెంటస్ ఫార్మసీ సంస్థ సరఫరా చేయనున్నది. తొలుత రెండు కోట్ల కోవాగ్జిన్ డోసులకు ఆర్డర్ ఇచ్చారు. కానీ ఇప్పటి వరకు ఒక్క డోసు టీకా కూడా చేరలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తులో ఆరోగ్యశాఖ తీరును తప్పుపట్టారు. దీంతో కోవాగ్జిన్ కోసం భారత్ బయోటెక్తో లింకు పెట్టుకున్న ప్రెసికా సంస్థ డీల్ను రద్దు చేయాలని పార్లమెంటరీ కమిటీ భావిస్తున్నది. కోవాగ్జిన్కు చెందిన టీకా పరీక్షలు పూర్తి కాకముందే, అధిక ధరలకు ఆ టీకా కోసం ఒప్పందం కుదిరినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ డీల్ను రద్దు చేయాలని బ్రెజిల్ పార్లమెంటరీ కమిటీ నిర్ణయించింది. కోవాగ్జిన్ స్కామ్లో తనకు ఎటువంటి పాత్ర లేదని బొల్సనారో చెప్పారు. కోవిడ్ను నియంత్రించడంలో బొల్సనారో విఫలమైనట్లు ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తక్కువ ధరకే కోవిడ్ టీకాలు లభిస్తుంటే.. కోవాగ్జిన్ ఒక డోసు టీకాకు 15 డాలర్లు ఎందుకు చెల్లిస్తున్నారని ఆరోగ్యశాఖపై విమర్శలు వచ్చాయి. ఇటీవల ఆ దేశ ఔషధ నియంత్రణశాఖ కేవలం 40 లక్షల కోవాగ్జిన్ టీకాలకు అనుమతి ఇవ్వడం గమనార్హం.