హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఏ సంస్థలోనైనా అధికారులు, కార్మికుల సంఖ్యలో ఎంతో కొంత మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. టీఎస్ఆర్టీసీలోని మాత్రం మొత్తం 48,064 మంది ఉద్యోగుల్లో 97.41శాతం కార్మికులే. అధికారులు, సూపర్వైజర్లు కేవలం 2.59 శాతం కావడం గమనార్హం. ఈ లెక్కన మన ప్రగతి రథచక్రాలను నమ్ముకొని 46,819 పేద కార్మిక కుటుంబాలు బతుకుబండిని లాగుతున్నాయి. ఇన్ని కుటుంబాల జరుగుబాటుకు ఆధారమైన ఆర్టీసీని కాపాడేందుకు ప్రభుత్వం తీసుకోని చర్యలేదు.. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్టీసీకి చేయూతనిస్తూనే, సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి జీతాల చెల్లింపులకు కూడా నిధులు సర్దుతూ వచ్చారు. కొందరు స్వార్థనాయకులు రాజకీయ ప్రయోజనాలకోసం కార్మికులను తప్పువదోవ పట్టించి సమ్మెపేరుతో రోడ్లపైకి తెచ్చినా.. ప్రభుత్వం పెద్ద మనస్సుతోనే వారిని అక్కున చేర్చుకుంది. పేద కార్మికుల జీవితాలు ఇబ్బందుల్లో పడొద్దన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ స్వయంగా వారిని ప్రగతిభవన్కు పిలిపించి మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. కష్టం వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వం వారికి అండగా నిలవడానికి ఏకైక కారణం ఆర్టీసీ పేదల రవాణా వ్యవస్థ కావడమే. ఆర్టీసీ కార్మికులను ఆదుకోవడమంటే పేద ప్రజలందరికీ అందుబాటులో ఉన్న సౌలత్ను కాపాడటమే. ప్రజలకు ఏండ్లుగా సేవ చేస్తున్న ఈ పేద కార్మిక కుటుంబాలను ఆదుకొనేందుకు స్వల్పంగానైనా బస్ చార్జీలు పెంచక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.