గూగుల్ ఉద్యోగులకు ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ విధానం
న్యూఢిల్లీ, మే 6: అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగుల కోసం ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ అనే సరికొత్త విధానాన్ని అమలు చేస్తున్నది. ఈ పద్ధతిలో ఇక ఆ సంస్థ ఉద్యోగులు వారంలో కేవలం 3 రోజులు ఆఫీస్కు వస్తే సరిపోతుంది. మిగిలిన రెండు రోజులు ఎక్కడి నుంచైనా పనిచేసేలా వారికి స్వేచ్ఛ కల్పిస్తున్నట్లు గూగుల్, ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. కరోనా తగ్గుముఖం పట్టి ఈ ఏడాది చివరి నాటికి గూగుల్ కార్యాలయాలను తిరిగి తెరిచినా 20 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని (వర్క్ ఫ్రమ్ హోం) చేస్తారని, 60 శాతం మందికి ‘హైబ్రిడ్ వర్క్ వీక్’ పద్ధతిలో పనిచేసే అవకాశం ఉంటుందని వెల్లడించారు. ఈ ఏడాది తొలి త్రైమాసిక గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గూగుల్లో 1,39,995 మంది ఫుల్టైమ్ (పూర్తిస్థాయి) ఉద్యోగులున్నారు. ఏ దేశంలో తమకు ఎంత మంది ఉద్యోగులున్నదీ గూగుల్ వెల్లడించకపోయినప్పటికీ ఒక్క భారత్లోనే దాదాపు 4 వేల మంది ఉద్యోగులు ఉంటారని అంచనా. వీరిలో ఎక్కువ మంది బెంగళూరు, హైదరాబాద్, ముంబై, గుర్గావ్లో పని చేస్తున్నారు.