హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): కరోనా పాజిటివ్ అని తెలియగానే చాలామంది కంగారు పడి దవాఖానలకు పరుగులు పెడుతున్నారని, స్వల్ప లక్షణాలు ఉన్నవారు ఇంట్లో ఐసొలేషన్లో ఉంటే సరిపోతుందని ఛాతి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ఖాన్ చెప్పారు. కొవిడ్ భయంతో ఎక్కువ మంది ఆక్సిజన్ అవసరం లేకున్నా తర్వాత బెడ్స్ దొరకవని భావించి ఆక్సిజన్ బెడ్స్కు వచ్చి చేరుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆక్సిజన్ అత్యంత అవసరమైనదని, స్వల్ప లక్షణాలున్న వారు గాభరాపడి దవాఖానలకు రావడం మంచిది కాదని చెప్పారు. దానివల్ల.. నిజం గా ఆక్సిజన్ అవసరం ఉన్నవాళ్లు అంబులెన్స్లోనే ప్రాణాలు కోల్పోతుండడం విచారకరమని ఆవేదన వ్యక్తంచేశారు. స్వల్ప లక్షణాలున్న వారికి ప్రభుత్వం కొవిడ్ కేర్ సెంటర్లు నేచర్క్యూర్, సరోజినీదేవి, ఆయుర్వేద దవాఖానల్లో మందులు, వైద్యసేవలు అందిస్తున్నట్టు వెల్లడించారు. ఇక్కడ వీరికి ఆక్సిజన్ అవసరం అనుకుంటే వేరే దవాఖానకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. భయాన్ని వీడితేనే కరోనా నుంచి బయట పడగలుగుతామని సూచించారు.