కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఆందోళనలోకి నెట్టేస్తున్నది.. ఇంట్లో తల్లిదండ్రులు లేదా ఇద్దరిలో ఏ ఒక్కరికైనా పాజిటివ్ వచ్చి.. వారు ఐసొలేషన్ కేంద్రం లేదా దవాఖానలో ఉంటే పిల్లల పరిస్థితి ఏంటో మాటల్లో చెప్పలేం. వాళ్లు ఎలా ఉన్నారు? సమయానికి తిన్నారా?లేదా? అని దిగులుపడిపోతుంటారు. కరోనా సోకిన పెద్దలు నయమయ్యే వరకు చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వం.. వారి పిల్లల సంరక్షణకూ ముందుకొచ్చింది. గ్రేటర్వ్యాప్తంగా వారి ఆలనాపాలన చూసేందుకు స్త్రీశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏడు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఒక్కో కేంద్రంలో వసతుల కల్పనకు రూ.5 లక్షలు కేటాయించింది. ఇందులో తల్లిదండ్రులతో ఎప్పటికప్పుడు మాట్లాడేలా సౌకర్యం కల్పించడంతోపాటు ఇంటి అనుభూతి కల్పించే భోజనం, స్నాక్స్ అందించనున్నారు. వినోదం కోసం టీవీ, ఆడుకునేందుకు పరికరాలు
ఏర్పాటు చేస్తున్నారు. వారి ఆరోగ్య సంక్షరణకు ప్రతి కేంద్రంలో డాక్టర్, నర్సును అందుబాటులో ఉంచారు.
తల్లిదండ్రులు లేదా ఇద్దరిలో ఒక్కరికి కరోనా సోకి పిల్లల సంరక్షణలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే చైల్డ్ హెల్ప్లైన్ 1098 లేదా స్పెషల్ హెల్ప్ డెస్క్కు 040- 23733665 నంబర్కు సమాచారమివ్వాలి. కేంద్రం చిరునామా, అందులో వసతుల గురించి
వివరిస్తారు. ఇక్కడ చేరాలంటే ముందు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. నెగెటివ్ వస్తేనే వారు కోరుకున్నన్ని రోజులు కేంద్రంలో ఉండేందుకు అనుమతిస్తారు.
తల్లిదండ్రులకు కొవిడ్ పాజిటివ్ వచ్చినా.. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఐసొలేషన్ లేదా దవాఖానలో ఉంటే వారి పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. ఈ నేపథ్యంలో కరోనా వచ్చిన తల్లిదండ్రుల పిల్లల సంరక్షణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించింది. అచ్చం అమ్మ..నాన్నలా.. ఆ చిన్నారుల ఆలనా.. పాలనా చూసుకునేందుకు నగరంతో పాటు శివారుల్లోనూ ట్రాన్సిట్ హోంలను ఏర్పాటు చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో సుమారు ఏడు కేంద్రాలను నెలకొల్పింది. ఒక్కో సెంటర్లో వసతుల కోసం సుమారు రూ.5 లక్షలను కేటాయించింది.
తల్లిదండ్రులకు లేదా ఇద్దరిలో ఏ ఒక్కరికి కరోనా వచ్చి పిల్లల సంరక్షణలో ఇబ్బందులు వస్తే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098కు లేదా స్పెషల్ హెల్ప్డెస్క్ 040- 23733665 నంబర్లో సమాచారం అందించాలని స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ట్రాన్సిట్ హోంలో చిన్నారులకు ఆశ్రయం కల్పించేందుకు ముందు కొవిడ్ పరీక్షలు నిర్వహించాకే చేర్చుకుంటామని, ఒకవేళ పిల్లల్లో పాజిటివ్ తేలితే వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్ కేంద్రం లేదా వైద్యశాలకు తరలిస్తామన్నారు.
ట్రాన్సిట్ హోంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ప్రభుత్వం సకల వసతులు సమకూర్చింది. అధునాతన పక్కా గృహంలో ఆశ్రయం కల్పించడంతో పాటు పౌష్టికాహారం, ఫిజియోలాజికల్ సపోర్ట్, రిక్రియేషనల్ ఆక్టివిటీ, వర్చువల్ కనెక్ట్ విత్ పేరెంట్స్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీతో పాటు టీవీలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక సిబ్బందిని నియమిస్తున్నారు. అలాగే ప్రతి హోంలో పార్ట్ టైం డాక్టర్, నర్సు (ఏఎన్ఎం), దుస్తులు, బెడ్స్, నిత్యావసరాలను అందుబాటులో ఉంచారు.