యాదాద్రి భువనగిరి, మే 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారిని తీవ్ర స్థాయిలో విస్తరించకుండా కట్టడి చేయడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు జిల్లాలో విజయవంతమవుతున్నాయి. నిర్ణీత దూ రం పాటించడం, మాస్కులు ధరించడం, పారిశుధ్యాన్ని మెరుగుపర్చడం వంటి చర్యలను ఆయా శాఖలు కట్టుదిట్టంగా చేపడుతున్నాయి. కరోనా అనుమానితులను ఎప్పటికప్పుడు క్వారంటైన్ చేయడం వంటి ప్రణాళికలను పక్కాగా అమలు చేయడంతోపాటు.. అత్యవసర చికిత్సలు అవసరమైన వారిని ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స చేస్తున్నారు. ఆక్సిజన్ సదుపాయాన్ని సైతం కల్పించి బాధితులు కరోనా నుంచి కోలుకునేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్థానికంగానే బాధితులకు అన్నిరకాల చికిత్సలు అందిస్తుండడంతో మానసిక స్వాంతన చేకూరి వారు త్వరగా కోలుకుంటున్నారు.
పర్యవేక్షణ కోసం నోడల్ అధికారుల నియామకం
జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రతి నిత్యం రెండు వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడంతో అప్రమత్తం అయిన జిల్లా అధికారులు ముందుచూపుతో జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోని దవాఖానలోని ఐసొలేషన్ కేంద్రంలో 40 బెడ్లకు ఆక్సిజన్ సదుపాయాన్ని అందుబాటులో ఉంచారు. అలాగే బీబీనగర్ ఎయిమ్స్లోని ఐసొలేషన్ కేంద్రంలో 80 బెడ్లను సిద్ధం చేసి ఉండగా.. వీటిలో 10 వరకు ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి. చౌటుప్పల్, ఆలేరు, రామన్నపేటలోని సీహెచ్సీ కేంద్రాల్లో 10 చొప్పున బెడ్లను ఏర్పాటు చేయగా.. ప్రతి సీహెచ్సీలోనూ 5 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులో ఉంచారు. పర్యవేక్షణ కోసం కలెక్టర్ అనితారామచంద్రన్ జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించింది. భువనగిరి ఏరియా ఆస్పత్రికి డీఆర్డీవో ఉపేందర్రెడ్డి, ఎయిమ్స్కు జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, చౌటుప్పల్ ఆస్పత్రికి స్థానిక ఆర్డీవో సూరజ్కుమార్ను, రామన్నపేట ఆస్పత్రికి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని నోడల్ అధికారిగా నియమించారు.
ఇంటికే కరోనా కిట్
కరోనా సోకి హోం ఐసొలేషన్లో ఉంటున్న రోగుల ఇంటికే వైద్య సిబ్బంది వెళ్లి కరోనా కిట్లు అందజేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 4,063 మంది హోం ఐసొలేషన్లో చికిత్స పొందుతున్నారు. కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఐసొలేషన్లో ఉన్న బాధితుల బాగోగులను అడిగి తెలుసుకుంటున్నారు. పారాసిటమల్తోపాటు జింక్, బీ కాంప్లెక్స్, విటమిన్-సీ టాబ్లెట్లు, మాస్క్, చేతి గ్లవ్స్, శానిటైజర్ బాటిల్తో కూడిన కిట్ను అందజేస్తున్నారు. బీపీ, షుగర్, గుండెజబ్బులు, టీబీ. వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారి పట్ల ప్రత్యేక పర్యవేక్షణ ఉంచి వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందులు అందజేస్తున్నారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ తేలిన వెంటనే అక్కడికక్కడే కిట్లు అందజేస్తుండగా.. కొందరి ఇండ్లకు వెళ్లి మరీ వైద్య సిబ్బంది కిట్లు ఇస్తున్నారు.
ఐసొలేషన్ కేంద్రాల్లో పౌష్టికాహారం
ప్రభుత్వ ఐసొలేషన్ కేంద్రాల్లో కరోనా రోగులకు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం, రాత్రి రుచికరమైన వేడి వేడి టిఫిన్లు, భోజనాలు, పండ్లు, అందిస్తున్నారు. ఆయా దవాఖానల్లో రోగులకు ఆహారం అందిస్తున్న కాంట్రాక్టర్లతోనే ఒప్పందం చేసుకుని కరోనా బాధితులకు అందించేలా ఏర్పా ట్లు చేశారు. ఎయిమ్స్ దవాఖానకు మాత్రం కలెక్టర్ అనితారామచంద్రన్ ఆధ్వర్యంలో ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆహారంలో ప్రత్యేకంగా కేలరీలు, ప్రొటీన్లు ఉండేలా చర్యలుతీసుకుంటున్నారు. ప్రతి రోజూ రెండు పూటలా గుడ్లతోపాటు, ఆదివారం చికెన్ వంటి వాటిని క్రమపద్ధతిలో అందజేస్తున్నారు. ఈ చర్యల ఫలితంగా కరోనా లక్షణాలు ఉన్న ఎంతోమంది వేగంగా కోలుకుంటున్నారు. ప్రస్తుతం భువనగిరి ఏరియా దవాఖానలో 17 మంది, ఎయిమ్స్, చౌటుప్పల్ దవాఖానల్లో నలుగురు చొప్పున కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా.. ఇప్పటివరకు పదిమందికి పైగానే బాధితులు ఆరోగ్యంగా మారి డిశ్చార్జి అయ్యి ఇండ్లకు వెళ్లిపోయారు.
దాతలు, స్వచ్ఛందసంస్థల సహకారం అభినందనీయం
కరోనా విపత్కర పరిస్థితుల్లో దాతలు, స్వచ్ఛందసంస్థల సహకారం అభినందనీయమని కలెక్టర్ అనితారామచంద్రన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో కరోనా నియంత్రణలో తమ వంతు సహకారంగా నల్లగొండ ఎన్ఆర్ఐ ఫోరం సభ్యులు మాస్కులు, పల్స్ ఆక్సీమీటర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెండో విడుత కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలన్నారు . విధిగా మాస్కు ధరించడంతో పాటు శానిటైజర్ను తప్పకుండా వినియోగించాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎన్ఆర్ఐ ఫోరం సభ్యులు శాంతిపుట్టా, సుధీర్, వినీల్రెడ్డి, స్వర్ణ పాల్గొన్నారు.
చికిత్స విషయంలో ఆందోళన చెందవద్దు
కరోనా వైరస్ బారిన పడినవారు ఆందోళన చెందవద్దు. జిల్లా పరిధిలోనే అన్ని రకాల చికిత్సలు అందించేందుకు ఏర్పాట్లు చేశాం. ఐదు చోట్ల ఆక్సిజన్ బెడ్లతో కూడిన ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఎంత మంది బాధితులు వచ్చినప్పటికీ చికిత్స అందించేందుకు సర్వం సిద్ధంగా ఉన్నాం. బాధితులకు పౌష్టికాహారంతో పాటు వ్యాధిని తట్టుకునే మందులు అంది స్తూ వైద్యుల సమక్షంలో నిరంతరం పర్యవేక్షిస్తున్నాం.
-సాంబశివరావు, డీఎంహెచ్వో, యాదాద్రి భువనగిరి జిల్లా