సుల్తాన్ బజార్, మే 25: బ్లాక్ ఫంగస్ బారినపడిన వారెవరూ భయాందోళన చెందవద్దని డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి అన్నారు. రోగులకోసం సరిపడ బెడ్లను సిద్ధం చేయడంతోపాటు అవసరమైన చికిత్స, మందులను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నదని చెప్పారు. మంగళవారం కోఠి ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానను సందర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లాక్ఫంగస్ రోగుల రద్దీకి అనుగుణంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు 1500 పడకలు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. బ్లాక్ఫంగస్ రోగులకు కొవిడ్ పాజిటివ్ ఉంటే గాంధీ దవాఖానలో, కొవిడ్ నుంచి కోలుకున్నవారికి కోఠి ఈఎన్టీలో వైద్యచికిత్సలు అందిస్తున్నట్టు చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో సరోజినీదేవి దవాఖానతోపాటు, గోల్కొండ, మలక్పేట, నాంపల్లి ఏరియా దవాఖానల్లోనూ పడకలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. బ్లాక్ఫంగస్ సోకి మల్టీపర్పస్ ఇబ్బందులున్న వారు వస్తున్న నేపథ్యంలో ఉస్మానియా దవాఖాన నుంచి ప్రొఫెసర్లను పిలిపించి రౌండ్ ది క్లాక్ రోగులకు పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈఎన్టీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ మాట్లాడుతూ.. దవాఖానకు వచ్చిన ప్రతిరోగికి అవసరమైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని, మందుల కొరత లేదని తెలిపారు. సమావేశంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వైస్చాన్స్లర్ కరుణాకర్రెడ్డి, సీఎంవో ఓఎస్డీ గంగాధర్, దవాఖాన పీఆర్వో డాక్టర్ మనీశ్కుమార్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, కోఠి ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానలో రోగుల సంఖ్య పెరుగుతుండటంతో మరో 50 పడకలను పెంచారు. దీంతో ఇక్కడ బ్లాక్ఫంగస్ పడకలు 300కు చేరాయి. మంగళవారం 337 బ్లాక్ఫంగస్ రోగులు రాగా వైద్యపరీక్షలు నిర్వహించి, 11 మందిని దవాఖానలో చేర్చుకొన్నారు.