హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా అదుపులో ఉన్నదని, తల్లిదండ్రులు ధైర్యంగా పిల్లలను పాఠశాలలకు పంపించాలని వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు కోరారు. విద్యార్థులు కొవిడ్ బారిన పడకుండా అన్నిరకాల చర్య లు తీసుకుంటున్నట్టు తెలిపారు. విద్యాసంస్థలు ప్రారంభమైన నేపథ్యంలో ఆయన బుధవారం కోఠిలోని డీఎంహెచ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తొలిరోజు విద్యార్థుల హాజరును బట్టి తల్లిదండ్రుల్లో భయం పూర్తిగా పోలేదని అర్థమవుతున్నదని పేర్కొన్నారు. కరోనా బాధితుల్లో చిన్నపిల్లల సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని, ఇన్ఫెక్షన్, మరణాలు పెద్దవారిలోనే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 63 లక్షల మంది బడి ఈడు పిల్లలు ఉండగా, ఇప్పటివరకు నమోదైన కరోనా బాధితుల్లో పదేండ్లలోపు పిల్లలు కేవలం 3 శాతం మంది ఉన్నారని, వీరంతా కోలుకున్నారని చెప్పారు. బాధితుల్లో 20 ఏండ్లలోపు వారు 13 శాతం మంది ఉన్నట్టు తెలిపారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
విద్యాసంస్థలు తెరవకపోవడం, ఆన్లైన్ క్లాసులు తదితర కారణాల వల్ల విద్యార్థుల్లో మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయని, చదువుపై ఆసక్తి తగ్గిపోతున్నదని శ్రీనివాసరావు పేర్కొన్నారు. కరోనా కట్టడిలో ఉన్నందున, అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే విద్యాసంస్థలు తెరిచేందుకు సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారని తెలిపారు. పాఠశాలల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు జరిపేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఐదుకన్నా ఎక్కువ కేసులు నమోదైతే ఆ విద్యాసంస్థను మూసివేయాలని సూచించారు.
కాలేజీ విద్యార్థులకు టీకాలు
18 ఏండ్లు నిండిన కాలేజీ విద్యార్థులకు టీకాలు వేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్టు శ్రీనివాసరావు తెలిపారు. టీకాలు వేసుకోని విద్యార్థుల వివరాలను యాజమాన్యం అందజేస్తే అక్కడికి వెళ్లి టీకా లు వేస్తామని చెప్పారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిలో 95 శాతం మందికి వ్యాక్సిన్లు వేసినట్టు వివరించారు. థర్డ్వేవ్ రావడానికి, అక్టోబర్లో కేసులు పెరుగుతాయనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవని తెలిపారు. కొత్త రకం స్ట్రెయిన్ వస్తే తప్ప థర్డ్వేవ్కు అవకాశం లేదని చెప్పా రు. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు ముం దస్తు ఏర్పాట్లుచేసినట్టు పేర్కొన్నారు.