మామూలు రోజుల్లో ఆదివారం వచ్చిందంటే నగర మార్కెట్లు కిటకిటలాడుతుంటాయి. చికెన్, మటన్, కూరగాయలు, చేపల కొనుగోలుకు ఎగబడుతుంటారు. అయితే లాక్డౌన్ కావడంతో నాలుగు గంటల్లో నిబంధనలు పాటిస్తూ నిత్యావసరాలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం సూచించింది. అయినా నగరవాసులు చాలాచోట్ల చికెన్, మటన్ దుకాణాల వద్ద బారులు తీరారు. కొవిడ్-19 నిబంధనలు మరిచి ఒకరిని ఒకరు తోసుకుంటూ మాంసం కొనుగోళ్లకు ఎగబడ్డారు. కరోనా వైరస్ వ్యాపిస్తుందన్న భయం లేకుండా గుంపులు గుంపులుగా తిరిగారు.
గ్రేటర్ పరిధిలో ఆదివారం వచ్చిందంటే కూరగాయల దుకాణాలకంటే ఎక్కువగా చికెన్, మటన్, చేపలు విక్రయ కేంద్రాల వద్దే రద్దీ అధికంగా ఉంటుంది. ఈ నెల 12 నుంచి లాక్డౌన్ ప్రారంభం కావడం.. కేవలం 4 గంటలపాటే సరుకుల కొనుగోళ్లు, ఇతర కార్యకలాపాలకు అనుమతి ఉండటంతో అందరూ ఒకేసారి బయటకొస్తుండటంతో రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. ఈ సమయంలో పోలీసులు సైతం పలుచోట్ల వారిని నియంత్రించలేకపోతున్నారు. త్వరగా కొనుగోలు చేసి వెళ్లాలన్న ధ్యాస తప్ప, కరోనా నిబంధనలు పాటించాలనే బాధ్యతను విస్మరిస్తున్నారు.
ఉదయం 6 గంటల నుంచి అనుమతి ఉన్నా, ఆ సమయంలో రోడ్లపైకి ఎవరూ పెద్దగా రావడం లేదని, కేవలం 8 నుంచి 10 గంటల మధ్యే ఒక్కసారిగా వస్తున్నారని చింతల్బస్తీ మటన్ షాపు నిర్వాహకుడు తెలిపారు. ఎక్కువమంది ఒకేసారి వస్తే అందరికీ ఇచ్చేంత సిబ్బంది ఆయా కేంద్రాల్లో అందుబాటులో లేకపోవడంతో ఒక్కొక్కరికి 10 నుంచి 20 నిమిషాలు పడుతున్నది. దీంతో చివరి రెండు గంటల నుంచి 15 నుంచి 20 మందికి మాత్రమే ఇవ్వగలుగుతున్నామని, ఆ సమయంలో వచ్చేవారు ఒక్కో దుకాణానికి 40 నుంచి 50 మంది వరకు ఉంటున్నారన్నారు.
ముఖ్యంగా బస్తీలు, కాలనీల్లోని మటన్, చికెన్ దుకాణాలు ప్రధాన రహదారులపై కాకుండా లోపల ఉండటంతో పోలీసులు వారిని నియంత్రించలేకపోతున్నారు. అసలే కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సిన నగరపౌరులు ఇలా నిబంధనలను లెక్క చేయకుండా కొనుగోళ్లు చేయడానికి ఎగబడటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా ఉండాలని, అప్పుడే కరోనా నియంత్రణ సాధ్యమని సూచిస్తున్నారు.
ముషీరాబాద్, మే 16 : అతిపెద్ద రాంనగర్ చేపల మార్కెట్ ఆదివారం కిక్కిరిసిపోయింది. కరోనా విజృంభణ వేళ భారీగా తరలివచ్చిన కొనుగోలుదారులు నిబంధనలను తుంగలో తొక్కారు. భౌతికదూరం పట్టింపు లేకుండా కొనుగోలు చేశారు. మార్కెట్లు కరోనా హాట్స్పాట్లుగా మారుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నా జనం పెడచెవిన పెట్టారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మార్కెట్లో ఇసుక వేస్తే రాలనంత జనం రావడం అధికార యంత్రాంగాన్ని నివ్వెరపరిచింది. కొంతమంది మాస్క్లు ధరించకపోగా, వ్యాపారులు కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్న దాఖలాలు కనిపించలేదు.