నిత్య వ్యవహారంలో ఇప్పటికీ
పల్లె ప్రాంతాల్లో కనిపించే, వినిపించే మాటల్లో, పాటల్లో, ఆటల్లో, సామెతల తరువాతి స్థానం పొడుపు కథలదే. భారతంలో యక్షుడిచే బంధింపబడిన తన సోదరులను బంధవిముక్తులను చేయటానికి ధర్మరాజు ‘యక్షప్రశ్నల’కు సమాధానం చెబుతాడు. అప్పటినుంచి ‘సమాధానం చెప్పటం దుస్సాధ్యం’ అనే ప్రశ్నలకు
‘యక్షప్రశ్నలు’ అనే నానుడి
వాడుకలోకి వచ్చింది.
ఈ యక్షప్రశ్నల వంటివే
‘పొడుపు కథ’లు. వీటిలో
కొన్ని వింతగా ఉండే
‘ఆధారాలు’ ఇచ్చి వాటికి సమాధానం చెప్పమనటం జరుగుతుంది. ఇలా ప్రశ్న వేయటమే ‘పొడుపు’ (ప్రశ్నతో పొడవటం వంటిది). ఆ యక్షప్రశ్నలాంటి ప్రశ్నకు ‘సమాధానం’ విడుపు. అలా ‘పొడుపు-విడుపు’గా ఉండే ఈ యక్షప్రశ్నలనుంచి
‘ఊగు-తాగు’- అంత్యప్రాస- వ్యంగ్యం-హాస్యం
కలిగి ఉంటాయి.
అలాంటి పొడుపు కథల్లో హాస్య, చమత్కారాన్ని తెలిపే మంచి పద్యాలున్నాయి.
తే॥: అన్నిటికీ జూడ రెండేసి అక్షరములు
ఆదులుడుపంగ, దుదలెల్ల నాదులసను,
చెప్పునాతడు భావాజ్ఞ శేఖరుండు
లక్షణో పేంద్ర! కృష్ణరా రాయక్షి తీంద్ర!
ఈ పద్యంలో ప్రతి ప్రశ్నకూ సమాధానం రెండక్షరాల్లోనే ఉండాలి. పైగా ఇంకో వింత నిబంధన కూడా పెట్టాడు కవి. ప్రతి సమాధానంలోని రెండో అక్షరం, తర్వాతి సమాధానానికి ముందు అక్షరంగా రావాలి. అలాగే వక్క, ఆకు, సున్నము కలిసిన తాంబూలాన్ని గురించి చెబుతూ, ‘పొడుపు కథ’ను పద్యరూపంలో చమత్కారంగా చెప్పాడు మరో కవి.
వండగ నెండిన దొక్కటి/ఖండించిన పచ్చిదొకటి
తిండికి రుచియై యుండును/
ఖండితముగ, దీనిదెల్పు కవియుంగలడే!
శిల, వృక్ష, లతల బుట్టిన/చెలువలు, మువ్వురును గూడి, చిడిముడిపడుచున్
దలవాకిట, రమియింతురు/సలవితముగ దీనినేఱుగు సరసలు గలరే?
(శిల-సున్నము; వృక్షం-వక్క; లత-ఆకు).
మజ్జిగకు తండ్రి పెరుగు; తాత-పాలు. పవిత్రమైన తరుణి (స్త్రీ) అయిన మజ్జిగ, తండ్రి అయిన పెరుగును చిలుకగా పుట్టుకొస్తుంది. అయితే, అలా తండ్రిని చంపి పుట్టిన మజ్జిగ మళ్లీ పాలనే తాతతో చేరి (తోడు వేయగా) తిరిగి పెరుగనే తండ్రిని కంటున్నది.. అని చెబుతూ పొడుపు కథలా సాగే పద్యం ఇది.
శుద్ధ కులజాత, యొకసతి/
ఇద్దరిణిం, తంద్రిజంపి యెసగ విశుద్ధిన్
బుద్ధి, బితామహు బొందుచు/
సిద్ధముగా దండ్రిగనున్-చెప్పుడు దీనిన్.
ఇలా పాటల రూపాల్లో, పద్యాల రూపాల్లో ఉన్న పొడుపు కథలు, ఎలా చమత్కారంగా ఉంటాయి.
అద్దంకి చెరువులో ముద్దంకి పిట్ట
ముక్కున బంగారం, తోకతో నీళ్లు తాగు.. (దీపం)
నీచే దెబ్బలు తిన్నాను, నిలువునా ఎండిపోయాను
నిప్పు గుండం తొక్కాను, గుప్పెడు బూడిద అయ్యాను.. (పిడక)
అయ్యకొయ్యలమారి, అమ్మ గిచ్చులమారి
బిడ్డలు రత్నమాణిక్యాలు.. (రేగుచెట్టు)
ఆకాశంలో ఉంటుంది-
కాని మేఘం కాదు
తోకతో ఉంటుంది- కాని ఎద్దు కాదు
అటు ఇటు తిరుగుతుంటుంది-
కాని పక్షి కాదు
ఝుమ్మని శబ్దం చేస్తుంది-
కాని తూనీగ కాదు
పట్టు తప్పితే చాలు పరుగు తీస్తుంది.. (గాలిపటం)
ఆకల్లేని అడవిలో- జీవం లేని జంతువు
జీవం గల జంతువుతో పోరాడింది.. (దువ్వెన)
ఐదుగురు పతులుండు- ద్రౌపది కాదు
మూల నల్లగనుండు- ముసలి కాదు
తలాతోకా నుండు- మరి నా పేరేమి? (పెన్ను)
కాటుకరంగు- కమలము హంగు
విప్పిన పొంగు- ముడిచిన కృంగు- నేనెవరిని? (గొడుగు)
కుమ్మరి కుప్పయ్య, పత్తి పాపయ్య, ఆముదాల అప్పయ్య అంతా ఏకమైనారు- (ప్రమిద)
చుక్కల గుర్రాన్నెక్కి సూటికర్రల చేతబట్టి
ఆకుల్లేని అరణ్యానికి- రాజకుమారుడు
వేటకెళ్ళాడు..(చంద్రుడు)
నాలుగు కాళ్ళుంటాయి-
మనిషిని కాదు
చెట్టూ-చేమా, అమ్మానాన్న-
అయితే కావచ్చు.. (కుర్చీ)
నిలువెల్ల తరువైతిని
తలవాకిట లోహమందు తలదూర్చితి నే
నిల, నా జాతి వినాశము
తల పెడుదును పేరుదెల్ప
తరమా నీకు..? (గొడ్డలి)
చెయ్యని కుండ, వెయ్యని సున్నం, పొయ్యని నీరు..(కొబ్బరి కాయ)
బాహువులు పదహారు-
బాణాసురుడు కాడు
వీపున జందెముండు-
విప్రుండు కాడు.. (రాట్నము)
మంచం కింద మామయ్య- ఊరికి పోదాం రావయ్యా.. (చెప్పులు)
మా తాత ఏటి అవతలకు వెళ్లి
మూడెడ్లు తెచ్చాడు- ఒకటి కరిగేది, ఒకటి తేలేది, ఒకటి మునిగేది..
(సున్నం, వక్క, ఆకు)
మూడు కన్నులుండు-
ముక్కంటిని గాను
నిండ నీరు వుండు-
కుండ గాను..(టెంకాయ)
వక్కలు, ఆకులు చేతిలో వున్న ఒక పండితుడు దారిన పోతున్న ఒక స్త్రీని సున్నము తెమ్మని చమత్కారంగా అడిగాడట.. (పొడుపు కథలా)
‘పర్వత శ్రేష్ట పుత్రికా, పతి విరోధి
యన్న పెండ్లాము, అత్తను గన్న తండ్రి
పేర్మి మీరిన ముద్దుల పెద్దబిడ్డ
సున్నమించుక తేగదే సుందరాంగి!’
ఈ విధంగా నర్మగర్భితంగా తనను సున్నం కోసం అడిగిన పండితునికి తన నెరజాణ తనంతో, తన పాండిత్యాన్ని ప్రదర్శించి, సమాధానం చెప్పిందట – ఆ స్త్రీ! (మాటకు మాటతో..)
పై పద్యంలో.. పర్వతశ్రేష్ట పుత్రిక- అనగా పార్వతి యొక్క పతి- మగడైన శివుని యొక్క, విరోధి- శత్రువు- అయిన మన్మథుని అన్న= బ్రహ్మ యొక్క, భార్యయగు- సరస్వతి యొక్క, అత్తగారగు లక్ష్మీని, కన్నతండ్రి- తండ్రి యగు సముద్రుని పెద్ద బిడ్డ – పెద్దమ్మ వారైన, సన్నుతాంగీ- ఓ యువతే అనగా, ‘ఓ దర్రిదపు పెద్దమ్మా, సున్నము తెచ్చిపెట్టు’ అన్నాడు.
‘శత పత్రంబుల మిత్రుని- పద్మ బాంధవుడైన సూర్యుని యొక్క సుతుడు- కుమారుడైన కర్ణుని- చంపిన వాడైన-అర్జునని యొక్క- బావ- కృష్ణుడు, సూనుని- కుమారుడైన, మన్మథుని మేనమామ చంద్రుడి తలను ధరించిన శివుని కుమారుడైన విఘ్నేశ్వరుని యొక్క-వాహనమైన- ఎలుక; వైరి- శత్రువైన పిల్లి యొక్క వైరి- శత్రువైన కుక్కా! సున్నంబిదిగో.. ఇదిగో సున్నము’ అని సమాధానమిచ్చింది.
‘ఓరి కుక్కా- ఇదిగోరా సున్నము!’ అన్నదన్నమాట. అలాగే గద్యరూపాల్లో (వచన పురాణ) వుండే పొడుపు కథల్లో కొన్ని మెదడుకు మంచిమేత పెట్టేవి ఉన్నాయి.
నాకు రెండు కాళ్ళున్నవి- కానీ మనిషిని కాను,
నాకు తల వున్నది, నోరున్నది-
కానీ కళ్ళు లేవు, నోటితో వస్తువులను
చేజిక్కించుకున్నానంటే మరి వదలను
నేను ఇల్లాండ్రకు చక్కగా
సాయపడుతుంటాను, నేనెవరిని?
ఇలాంటివి ఎన్నో జన బాహుళ్యంలో ప్రచారంలో ఉన్నాయి. వీటితో మెదడుకు మేత, మానసిక ఉల్లాసం మెండుగా కలుగుతుంది. ఇవే జన జీవనంలో ఆనందాలకు ఆనవాళ్లు.