అబిడ్స్, జూలై 3: హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోదాలు వరుసగా మూడో రోజూ కొనసాగాయి. సొసైటీ నిధులు అక్రమంగా దారిమళ్లినట్లు తేలడంతో శనివారం రాత్రి పలు ఫైళ్లు, కీలక పత్రా లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది. అధికారులు ఈ సొసైటీలో అనేక అక్రమాలను గుర్తించినట్టు సమాచారం. హైదరాబాద్ రేంజ్-2 ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ పర్యవేక్షణలో జరిగిన ఈ సోదాల్లో సొసైటీ స్థలాల లీజు, నిర్మాణాలు, వాటికైన ఖర్చులు, సొసైటీ ఆధ్వర్యంలోని 19 విద్యాసంస్థలకు నిధుల కేటాయింపు, ఏటా నిర్వహించే నుమాయిష్ ప్రదర్శనలో స్టాళ్ల కేటాయింపులు తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బీజేపీ నేత ఈటల రాజేందర్ ఈ సొసైటీ గౌరవాధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో అనేక అవతవకలు జరిగాయని సొసైటీ సీనియర్ సభ్యుడు, లాల్బహదూర్ శాస్త్రి కాలేజ్ మాజీ సెక్రటరీ రవీంద్రసేన్ మే 25న సీఎం కేసీఆర్కు ఫిర్యాదు చేశారు. సీఎం ఆదేశాలమేరకు ఏసీబీ అధికారులు మూడ్రోజుల నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈటల హయాంలో ఈ సొసైటీలో జరిగిన బాగోతాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి. సొసైటీ కాలేజ్ మేనేజ్మెంట్ సభ్యుల నియామకంతోపాటు మరో 7 అంశాలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్న అధికారులు.. మొత్తం మూడు సొసైటీలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఎకనామికల్, ఉస్మానియా గ్రాడ్యుయేట్, ఎగ్జిబిషన్ సొసైటీల వివరాలను తనిఖీ చేస్తున్నారు. సొసైటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు రూ.12 లక్షలు ఇచ్చినట్లుగా ఆధారాలు లభించడంతో ఆ డబ్బు ఇవ్వడానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఆరేండ్ల కార్యకలపాలపై ఆరాతీసి.. అవకతవకలు జరిగినట్లు తేలితే ఈటలపై కేసు నమోదుచేసే అవకాశమున్నది.
సొసైటీ స్థలంలో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నట్టు ఏసీబీ దృష్టికి రావడంతో వాటికి ఎవరు అండ గా ఉన్నారన్న దానిపై కూపీ లాగుతున్నది. మరోవైపు వరంగల్లో ఈ సొసైటీ నడుపుతున్న ఎల్బీ కాలేజీలో యూజీసీ నిధులతో నిర్మించిన భవనాన్ని నాణ్యత లేకుండా నాసిరకంగా నిర్మించినట్లు ఆరోపణలు రావడంతో వాటిపై అధికారులు దృష్టి సారించారు. ఒక ఫార్మసీ కాలేజీనుంచి రూ.78 లక్షల నిధులను అక్రమంగా సొసైటీ ఖాతాలోకి మళ్లించారన్న ఆరోపణలపైనా విచారణ జరుపుతున్నారు. సొసైటీకి వచ్చే ఆదాయంలో 85 శాతాన్ని కాలేజీలకు ఉపయోగించాల్సి ఉన్నప్పటికీ వాటిలో 50 శాతం నిధులను దుర్వినియోగం చేశారని, దీని గురించి ప్రశ్నించినందుకే తన సభ్యత్వాన్ని రద్దు చేశారని రవీంద్రసేన్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ సోదాలు ఆదివారం కూడా కొనసాగవచ్చని తెలుస్తున్నది.
సొసైటీలో కొత్త వారికి సభ్యత్వం కేటాయింపులో అక్రమాలు జరిగాయని, నిబంధననలకు విరుద్ధంగా 2018లో ఈటల కుమారుడు నితిన్తోపాటు పలువురికి ఏకపక్షంగా సభ్యత్వం ఇచ్చారని రవీంద్ర సేన్ తన ఫిర్యాదులో పేర్కొనడంతో దీనిపైనా ఏసీబీ ఆరా తీస్తున్నది. సొసైటీ బైలాస్కు విరుద్ధంగా 62 మందికి మెంబర్షిప్లు ఇచ్చినట్టు గుర్తించింది. సొసైటీ వ్యవహారాల్లో నితిన్ జోక్యం చేసుకోవడంపై అధికారులు లోతు గా విచారణ జరుపుతున్నారు. సొసైటీకి సంబంధించిన పలు భవనాలకు రెండేండ్ల క్రితమే లీజు ముగిసినప్పటికీ ఆయా లీజు సంస్థలు ఇంకా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్టు అధికారుల దృష్టికి వచ్చింది. నిబంధలకు విరుద్ధంగా సొసైటీ ఆదాయాన్ని సభ్యులు పంచుకున్నట్టు తేలింది. ఇన్సెంటివ్ల రూపంలో సభ్యులకు అక్రమంగా సరుకులు పంపిణీ చేశారని, అంతేకాకుండా ఖర్చుల కింద సభ్యులకు రూ.1.5 కోట్లు చెల్లించారని ఆరోపణలు రావడంతో వాటి వివరాలు కూడా సేకరిస్తున్నారు.