ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు
సిద్దిపేట/కామారెడ్డి, జూన్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలోనే తొలుత సిద్దిపేట సమీకృత కలెక్టరేట్ను సీఎం కేసీఆర్ ప్రారంభించడం జిల్లా ప్రజల అదృష్టమని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పర్యటన దృష్ట్యా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ప్రారంభ ఏర్పాట్లను ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మతో కలిసి మంత్రి శనివారం పరిశీలించారు. అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం కేసీఆర్ పర్యటన ఉంటుందని వివరించారు. మొదట ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసును ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం పోలీసు కమిషనరేట్, సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం ఉంటుందని వివరించారు. ఆ తర్వాత మీటింగ్ హాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం కానున్నట్టు తెలిపారు. 70 ఏండ్లలో జరగని అభివృద్ధిని, స్వరాష్ట్రంలో 7 ఏండ్లలో చేశామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దేశానికి దశ, దిశా ఇచ్చేలా అన్ని కొత్త జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్లు నిర్మిస్తున్నామని స్పష్టంచేశారు. సిద్దిపేట ప్రాంత ప్రజల దశాబ్దాల ప్రత్యేక జిల్లా ఆకాంక్షను సీఎం కేసీఆర్ నెరవేర్చారని గుర్తుచేశారు. సిద్దిపేట, మెదక్ జిల్లాల ఏర్పాటుతో ప్రజలకు దూరభారం తగ్గిందని చెప్పారు. కామారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్, జిల్లా పోలీసు కార్యాలయాల వద్ద స్వాగత ఏర్పాట్లను జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్, విప్ గంప గోవర్ధన్ శనివారం పరిశీలించారు.