మండుటెండల్లో మత్తళ్లు పోస్తున్న చెక్డ్యామ్లు
పాలేరుపై 20కి.మీ, ఆకేరుపై 15కి.మీపైన నిలిచిన నీరు
తొర్రూరు, ఏప్రిల్ 17: మొన్నటివరకు భూగర్భ జలాలు ప్రమాదకరస్థాయిలో అడుగంటి, వ్యవసాయం భారంగా మారిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు, పెద్దవంగర మండలాలకు స్వరాష్ట్రంలో జల సవ్వడి సంతరించుకున్నది. ఎస్సారెస్పీ రెండోదశలో విడుదలైన గోదావరి జలాలతో చెరువులు, కుంటలు నిండి సంద్రాలను తలపిస్తున్నాయి. ఈ రెండు మండలాల నుంచి ప్రవహించే ఆకేరు, పాలేరు వాగుల్లో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టేందుకు చిన్న నీటిపారుదలశాఖ (ఐబీ) ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ రెండు మండలాలతోపాటు నెల్లికుదురు, దంతాలపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు ప్రయోజనం చేకూర్చేలా 14 చోట్ల చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రతిపాదనలుచేసింది. పాలేరు, ఆకేరుపై నూతనంగా 10 చెక్డ్యామ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇస్తూ ఇప్పటికే రూ.45.47 కోట్లు కేటాయించింది. గోదావరి జలాలను వాగుల్లోకి విడుదలచేయడంతో మండుటెండలో సైతం ఆకేరుపై సుమారు 15 కిలోమీటర్లు, పాలేరుపై సుమారు 20 కిలోమీటర్ల మేర జల సవ్వడి వినిపిస్తున్నది. ప్రస్తుతం ఉన్న చెక్డ్యాంలు మత్తళ్లు పోస్తున్నాయి.