న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: పద్దెనిమిదేండ్లు నిండిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సినేషన్ చేపట్టేందుకు కొవిన్ పోర్టల్లో బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అయితే వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ కోసం పెద్దఎత్తున ప్రజలు ఒక్కసారిగా ‘కొవిన్’ పోర్టల్లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించంతో వెబ్సైట్ కొద్దిసేపు క్రాష్ అయ్యింది. దీంతో పలువురు ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్మీడియా వేదికలపై అసహనం వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్లకు ఉద్దేశించిన మరో మాధ్యమం ‘ఆరోగ్యసేతు’ యాప్లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. రిజిస్టర్ కావడానికి అవసరమైన ఓటీపీ.. మొబైల్ నంబర్లకు రాలేదని కొందరు, ఆలస్యంగా వచ్చాయని మరికొందరు ఆరోపించారు. దీనిపై ఆరోగ్యసేతు ప్రతినిధులు ట్విట్టర్ మాధ్యమంగా స్పందించారు.
4 గంటలకు పేర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన సమయంలోనే ‘కొవిన్’ పోర్టల్లో కొన్ని అవాంతరాలు తలెత్తాయని, అయితే తర్వాత వాటిని పరిష్కరించినట్టు తెలిపారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా మే 1వ తేదీ నుంచి 18 ఏండ్లు పైబడిన వారందరూ టీకాలు తీసుకునేందుకు అర్హులని కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇందుకోసం కొవిన్ పోర్టల్ లేదా ఆరోగ్యసేతు లేదా ఉమాంగ్ యాప్లో తప్పనిసరిగా ముందస్తు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికి మాత్రమే టీకాలు ఇస్తారని తెలిపింది. మే 1 నాటికి రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ప్రైవేట్ దవాఖానలు సిద్ధం చేసిన టీకా కేంద్రాల ఆధారంగా అపాయింట్మెంట్/స్లాట్ బుకింగ్ ఉంటుందని వెల్లడించింది.
18+కు దొరకని అపాయింట్మెంట్
బుధవారం రాత్రి సమయానికి కొవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అయితే, 45 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే స్లాట్ బుక్ అవుతుండగా, 18 ఏండ్లు పైబడిన వారికి టీకా కేంద్రాలు చూపించడంలేదు. దీనిపై అధికారులు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేట్ దవాఖానలు వ్యాక్సినేషన్ సెషన్లను సిద్ధం చేసిన తర్వాతనే 18 ఏండ్లు పైబడిన వారు వ్యాక్సిన్ అపాయింట్మెంట్ (టీకా వేసుకునే కేంద్రం, టీకా రకం, సమయం తదితరాలతో కూడిన స్లాట్) తీసుకోగలరని వెల్లడించారు. వ్యాక్సిన్ బుకింగ్ కోసం స్లాట్లు కనిపించకపోతే, కొంత సమయం తర్వాత మళ్లీ ప్రయత్నించాలని.. త్వరలోనే స్లాట్లు అందుబాటులోకి వస్తాయని ఆశిస్తున్నట్టు వివరించారు. మరోవైపు, ‘కొవిన్’ పోర్టల్కు నిమిషానికి సగటున 27 లక్షల చొప్పున హిట్స్ (వెబ్సైట్ క్లిక్స్) వచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మూడుగంటల్లోనే 80 లక్షలమంది రిజిస్టరైనట్టు వెల్లడించాయి.
వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభించలేం: పలు రాష్ర్టాలు
18 ఏండ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మే 1 నుంచి ప్రారంభించలేమని ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్ర ఇప్పటికే ప్రకటించాయి. టీకాల కొరత, లాజిస్టిక్ సమస్యలే దీనికి కారణంగా పేర్కొన్నాయి. రాష్ట్రంలో టీకాల కొరత ఎక్కువగా ఉన్నదని దీంతో 18 ఏండ్లు పైబడిన వారికి శనివారం నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలవ్వడం అనుమానమేనని తమిళనాడు, రాజస్థాన్, అస్సాం, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన అధికారులు పేర్కొన్నారు.
రాష్ర్టాలకు రూ.300కే కొవిషీల్డ్: సీరం
రాష్ర్టాలకు సరఫరా చేసే కొవిషీల్డ్ టీకా ధరలను 25% తగ్గిస్తున్నట్టు సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) బుధవారం వెల్లడించింది. రాష్ర్టాలకు ఒక్కో డోసును రూ.400కు విక్రయిస్తామని ఎస్ఐఐ ఇంతకుముందు ప్రకటించింది. దాన్ని రూ.100 తగ్గించి రూ.300కు విక్రయిస్తామని బుధవారం తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి కొవిషీల్డ్ ఒక్కో డోసును రూ.150కి విక్రయించిన ఎస్ఐఐ… రాష్ర్టాలకు మాత్రం రూ.400గా నిర్ణయించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రూ.100 తగ్గిస్తున్నట్టు ఎస్ఐఐ సీఈవో అదర్ పూనావాలా ట్విట్టర్లో తెలిపారు. ఈ తగ్గింపు వెంటనే అమలులోకి వస్తుందని, దీంతో రాష్ర్టాలకు వందల కోట్ల నిధులు ఆదా అవుతాయన్నారు.