హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): గీత కార్మికులకు త్వరలో లూనాలు పంపిణీ చేస్తామని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రకటించారు. గీత కార్మికులకే పూర్తి హక్కులు ఉండేలా దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో నీరా పాలసీ తెచ్చామని పేర్కొన్నారు. రూ.20 కోట్లతో హైదరాబాద్లోని పీవీమార్గ్లో నీరా కేఫ్ నిర్మిస్తున్నట్టు వెల్లడించారు. గురువారం హైదరాబాద్ రవీంద్రభారతిలో ఆబ్కారీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కల్లుగీత వృత్తిదారులకు కేసీఆర్ అభయ హస్తం కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, తలసాని శ్రీనివాస్యాదవ్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ప్రమాదవశాత్తు మరణించిన గీత వృత్తిదారులకు చెందిన 126 కుటుంబాలకు (ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున), శాశ్వత వైకల్యం పొందిన 147 మందికి (ఒకొక్కరికి రూ.5 లక్షల చొప్పున), తాత్కాలిక అంగవైకల్యం పొందిన 315 మందికి ( ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున) ఇలా మొత్తం 588 మంది లబ్ధిదారులకు రూ.13.96 కోట్ల ఎక్స్గ్రేషియా పంపిణీ చేశారు.
ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మికుల పిల్లలను ప్రభుత్వ గురుకుల, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివించే బాధ్యత ఎక్సైజ్శాఖ తీసుకుంటుందని శ్రీనివాస్గౌడ్ హామీ ఇచ్చారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. సబ్బండవర్ణాల అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ పాటుపడుతున్నారని చెప్పారు. కుల సంఘాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ప్రకాశ్గౌడ్, దానం నాగేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్, ఎక్సైజ్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, గౌడ సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కొత్త బిచ్చగాళ్ల అడ్డగోలు విమర్శలు: మంత్రి తలసాని
కొందరు కొత్త బిచ్చగాళ్లు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. వారికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడంలేదని మండిపడ్డారు. రాజకీయాలు చేస్తూ.. పూటకో మాట మాట్లాడుతున్నారని పరోక్షంగా కాంగ్రెస్, బీజేపీపై విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్నికులాలవారు కాలర్ ఎగరేసుకుని సంతోషంగా బతుకుతున్నారని పేర్కొన్నారు.