హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో స్కూళ్లు ఇప్పటికీ తెరచుకోలేదు. గతేడాది నుంచి ఆన్లైన్ తరగతుల ద్వారానే విద్యాభ్యాసం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లోని ఎస్సీ విద్యార్థుల స్థితిగతులు, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సెంటర్ ఫర్ ఎకానమిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్)లోని ఎస్సీఎస్డీఎఫ్ రీసెర్చ్ యూనిట్ సర్వే నిర్వహించింది. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు? రిమోట్ క్లాస్ను ఎలా ఫీలవుతున్నారు? పాఠ్యాంశాలను నేర్చుకోవడంలో ఎలాంటి ఇబ్బందులకు గురవుతున్నారు? సమస్యలను అధిగమించడంలో వారికి ఉపాధ్యాయులు ఏవిధంగా సహకరిస్తున్నారు? విద్యార్థులపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఏవిధంగా ఉన్నది? తదితర అంశాలపై జడ్పీహెచ్ఎస్లు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి వివరాలను సేకరించింది. కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో 15 విద్యాసంస్థలకు చెందిన 90 మంది టీచర్లతోపాటు 9, 10 తరగతులకు చెందిన 240 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
సిలబస్ పూర్తిలో జడ్పీహెచ్ఎస్ల వెనుకబాటు
సిలబస్ను పూర్తి, విద్యార్థులతో ఎప్పటికప్పుడు సంభాషణ, రిమోట్ క్లాస్ విధానానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంచుకోవడంలో జడ్పీహెచ్ఎస్ల కంటే సంక్షేమ, గురుకుల, ఆశ్రమ పాఠశాలలే చాలా ముందున్నట్లు సెస్ నివేదిక స్పష్టం చేసింది. సాధారణ రెసిడెన్షియల్ స్కూళ్లు 45 శాతం, ఆశ్రమ, ప్రత్యేక గురుకులాలు 90 శాతం సిలబస్ను పూర్తి చేసినట్టు తెలి పింది. 62 శాతం మంది టీచర్లు విభిన్న పద్ధతుల్లో టెక్నాలజీ ద్వారా ఆన్లైన్ విద్యకు అనుగుణంగా పాఠ్యాంశాలను బోధించడంతోపాటు అందుకు అవసరమైన మెటీరియల్ను సొంతం గా సిద్ధం చేసుకున్నట్టు వెల్లడించింది. రిమోట్ విధానంలో విద్యాబోధన కొనసాగినా 86.7 శాతం మంది ఉపాధ్యాయులు తమ విద్యార్థులతో నిత్యం టచ్లో ఉంటున్నారని, కేవలం 13.3 శాతం మంది ఉపాధ్యాయులు మాత్రమే విద్యార్థులకు అందుబాటులో ఉండడం లేదని వెల్లడించింది.