ప్రతివ్యక్తీ ఏదో ఒక ప్రయోజనం కోసం ఎదురుచూపు. మరోవైపు రాష్ట్రవిభజన చిక్కుముడులు.. అడుగడుగునా కొత్త కష్టాలు, సవాళ్లు.. తెలంగాణ వాళ్లకు పాలనే రాదన్న వెక్కిరింపులు.. వీటన్నింటినీ గెలిచి నిలిచింది తెలంగాణ. కార్యసాధకుడు సీఎం కేసీఆర్ అపార పాలనానుభవంతో కొత్త రాష్ట్రం తెలంగాణ దేశంలోని అన్ని రాష్ర్టాలకూ ఆదర్శంగా నిలబడింది. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ ఈ ఆరేండ్లలో ఏదో ఒకరూపంలో ప్రభుత్వం నుంచి లబ్ధి చేకూరింది. ప్రభుత్వం తెచ్చిన ప్రతి పథకం దేశవ్యాప్తంగా కొత్త చర్చను లేవదీసింది. ప్రపంచమంతా తెలంగాణవైపు చూసేలా చేసింది. ఇప్పటికీ అనేక రాష్ర్టాలు తెలంగాణ పథకాలను, ప్రయోగాలను అనుసరిస్తూనే ఉన్నాయి. ఇదీ తెలంగాణ.. మన బంగారు మాగాణ..
రైతుబంధు పథకం ద్వారా 2018 వానాకాలం సీజన్ నుంచి ఈ యేడాది యాసంగి సీజన్ వరకు ఆరు విడతల్లో రూ. 35660 కోట్లు రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం అందించింది. ఈ యాసంగి ఒక్క సీజన్లోనే 59.16 లక్షల మంది రైతులకు రూ. 7351 కోట్లు అందించింది. పెట్టుబడికి ఆసరా అయింది.మాకు రెండెకరాల పొలం ఉంది. ప్రభుత్వం రైతుబంధు కింద ఇచ్చే సాయంతో పెట్టుబడి ఇబ్బందులు తప్పినయ్. ఈ పైసలు రాకముందు ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకొనేటోళ్లం.
– మల్లేశం, రైతు, రంగారెడ్డి జిల్లా
రాష్ట్రప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ రూపంలో పారదర్శకత పెంచడంతోపాటు రెవెన్యూ అధికారులపై ఉన్న అవినీతి మరకను తొలిగించింది. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించి, వారిని రైతులకు మరింత దగ్గర చేసింది. 504 జూనియర్ అసిస్టెంట్, 257 నాయబ్ తహసీల్దార్ పోస్టులను భర్తీ చేసింది.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని చిన్నప్పటి నుంచి నా కల. స్వరాష్ట్రంలో ఆ కల నెరవేరింది. నిత్యం ప్రజలతో మమేకం అయ్యే ఉద్యోగంలో చేరినందుకు చాలా ఆనందంగా ఉన్నాను. రెవెన్యూ వ్యవస్థలో గత ఆరేండ్లలో చాలా సానుకూల మార్పులు జరిగాయి.
– నవీన్, నాయబ్ తాసీల్దార్, గుమ్మడిదల మండలం
ఏ కారణంతో అయినా రైతు చనిపోతే అతని కుటుంబానికి రైతుబీమా పథకం కింద ప్రభుత్వం రూ.5 లక్షలు చెల్లిస్తున్నది. పథకం ప్రారంభమైనప్పటి నుంచి మరణించిన 43,293 మంది రైతుల కుటుంబాలకు రూ.2,164 కోట్లు బీమాగా చెల్లించింది. రైతుబీమా కింద గత మూడేండ్లలో ప్రభుత్వమే రూ.2,917 కోట్ల ప్రీమియం చెల్లించింది.
అప్పుల బాధతో నా భర్త చనిపోయాక నేను నా పిల్లలు రోడ్డున పడ్డామని అనుకున్నాం. కానీ ప్రభుత్వం దేవునిలా ఆదుకుంది. రైతుబీమా కింద రూ. 5 లక్షలు ఇచ్చింది. ఆ పైసలతో అప్పులు తీర్చాం. మా కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వానికి ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.
– పద్మ, రైతుబీమా లబ్ధిదారు
బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా అమలుచేస్తున్న వివిధ పథకాల కింద ఈ ఏడాది జనవరి నాటికి 3,637 మంది లబ్దిదారులకు రూ.112 కోట్లకుపైగా పంపిణీ చేశారు. పేద బ్రాహ్మణులు వ్యాపారాలు చేసుకోవటానికి రూ.5 లక్షలవరకు, విదేశీ విద్యకోసం రూ.20 లక్షల వరకు ప్రభుత్వం సహాయం చేస్తున్నది.
మాది మంచిర్యాల. నేను గతంలో హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేశేవాడిని. బ్రాహ్మిణ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్కీమ్ ఆఫ్ తెలంగాణ (బెస్ట్) స్కిం కింద 2018లో మహీంద్రా కారు కొనుగోలు చేశాను. నాకు రూ.5 లక్షలు సహాయం అందింది. ఇప్పుడు నేను సొంతంగా నా కారు కిరాయిలకు నడుపుకొని ప్రతినెలా రూ. 50వేలకు తగ్గకుండా సంపాదిస్తున్నాను.
– అష్టకాల రాజేశ్, మంచిర్యాల, ‘బెస్ట్’ పథకం లబ్ధిదారు
మాది సైదాబాద్లోని చాలా పేద కుటుంబం. అమెరికాలోని డేటన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ కోర్సు చదవటానికి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ 2019 జనవరిలో రూ. 20 లక్షలు మంజూరు చేసింది. మరో ఏడాదిలో నా కోర్సు పూర్తవుతుంది.
– దోరేపల్లి స్నిగ్ధ, సైదాబాద్, వివేకానంద ఒవర్సీస్ పథకం లబ్ధిదారు
పాఠశాల విద్యాశాఖలో 9,620 ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతివ్వగా, 9,164 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. వీటిలో 8,443 ఉపాధ్యాయ నియామకాలు పూర్తికాగా మిగతావి ఎంపిక దశలో ఉన్నాయి.
2013లో డైట్ కోర్సు పూర్తిచేశా. మా ఉద్యోగాలు మా బిడ్డలకే అని నాడు కేసీఆర్ చేసిన ప్రకటనతో కష్టపడి చదివిన. అనుకున్నట్టుగానే తెలంగాణ వచ్చిన తర్వాత 2016లో టీఆర్టీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. టీచర్గా ఎంపికై ప్రస్తుతం ఇందిరానగర్ (బోరబండ) స్కూల్లో పనిచేస్తున్నా.
– లావుడ్యా రాంకుమార్, (టీఆర్టీ- 2016లో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయుడు)
టీచర్ల కొరతను అధిగమించేందుకు పాఠశాలల్లో నియమించిన విద్యావలంటీర్లకు ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.1,500 నుంచి రూ.8వేలలోపే ఉండేది. తెలంగాణ సర్కారు విద్యావలంటీర్ల వేతనాలను రూ.12 వేలకు పెంచింది. దాంతో 16,300 మందికి లబ్ధి చేకూరింది.
ఎంఎస్సీ, బీఈడీ పూర్తిచేసిన నేను ఐదేండ్లుగా విద్యావలంటీర్గా పనిచేస్తున్నా. గతంలో మాకు నెలకు రూ.8వేలే వేతనం ఇచ్చేవారు. తెలంగాణ వచ్చాక రూ.12 వేలు ఇస్తున్నారు. ఒకేసారి రూ.4 వేలు పెంచి న్యాయంచేశారు.
– జ్యోతి (విద్యావలంటీర్, బోరబండ పాఠశాల)
తెలంగాణ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలను ఆదుకొని అండగా నిలిచింది. నా భర్త రాజిరెడ్డి మిలియన్ మార్చ్లో టియర్ గ్యాస్ తగిలి చనిపోయాడు. నా జీవితం ఒక్కసారిగా అగాధంలో పడిపోవటంతో ఉద్యమ నాయకులు నాకు ధైర్యాన్ని ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ నిర్ణయంతో నాకు ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల నగదు వచ్చింది. నా అర్హతకు తగినవిధంగా స్త్రీ శిశు సంక్షేమశాఖలో జూనియర్ అసిస్టెంట్గా 2016లో ఉద్యోగం ఇచ్చారు. ప్రభుత్వ భరోసాతో భర్త లేకున్నా నా పిల్లలను చదివించుకుంటూ జీవితాన్ని వెల్లదీస్తున్న.
-సరస్వతి, స్త్రీ-శిశు సంక్షేమశాఖ, హైదరాబాద్
ఉమ్మడి రాష్ట్రంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హెచ్ఆర్ పాలసీ తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పించారు. పీఆర్సీ ఇచ్చినప్పుడు రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే మాకు కూడా భారీగా వేతనాలు పెరిగాయి.
-ప్రవీణ్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు
2018లో నాకు టీఎస్ఎస్పీడీసీఎస్లో ఇంజినీర్గా ఉద్యోగం వచ్చింది. నాతోపాటు వందమంది ఇంజినీర్లకు మా సంస్థలో కొత్తగా ఉద్యోగాలు వచ్చాయి. అందరం హ్యాపీగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో మొత్తం తెలంగాణకు చెందిన ఇంజినీర్లకే ఉద్యోగాలు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది.
– కే వినయ్కుమార్రెడ్డి, ఏఈ, కొందుర్గు, రంగారెడ్డి జిల్లా
2019 ఆగస్టులో నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. నాన్న సహచరుల సూచనమేరకు కారుణ్యనియామకం కింద ఉద్యోగం కోసం దరఖాస్తు చేశాను. ప్రభుత్వ అధికారులు పిలిచి నాకు జిల్లా ట్రెజరీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 30న మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి చేతులమీదుగా నియామక ప్రతం అందుకొని ఉద్యోగం చేస్తున్న.
– రాంచరణ్, కారుణ్యనియామక ఉద్యోగి, డీటీవో కార్యాలయం, మహబూబ్నగర్
స్వరాష్ట్రంలో నీటిపారుదల రంగంలో కనీవినీ ఎరుగని స్థాయిలో కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. ఈ శాఖలో 2016లో 390, 2018లో 320 ఏఈఈ పోస్టులను భర్తీచేసింది. భారీ, మధ్యతరహా, చిన్ననీటిపారుదల విభాగాలను ఒకే గొడుగు కిందికి తీసుకురావటంతో అదనంగా 618 పోస్టులు పెరిగాయి.
నేను 2016లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్గా ఉద్యోగంలో చేరాను. ప్రస్తుతం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్ వద్ద పనిచేస్తున్నాను. కృష్ణా జలాలను సుమారు 500 మీటర్లకు ఎత్తిపోసే మహాయజ్ఞంలో భాగస్వామిని అవుతుండటం సంతోషంగా ఉన్నది.
-అనూష, ఏఈఈ
టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయశాఖలో ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక విస్తరణ అధికారి ఉండాలన్న ఉద్దేశంతో కొత్త ఏఈవోల నియామకం చేపట్టింది. ఇప్పటివరకు 1,526 మంది ఏఈవోలను ప్రభుత్వం నియమించింది.
నేను బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేశాను. చదువు పూర్తికాగానే ఏఈవో పోస్టుల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వటంతో కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించిన. మా కుటుంబంలో తొలి ప్రభుత్వం ఉద్యోగిని నేనే. సకాలంలో నోటిఫికేషన్ రావడంతోనే ఈ ఉద్యోగం సాధించగలిగాను.
– సునీల్, ఏఈవో, మొయినాబాద్
టీఎస్ఆర్టీసీకి తిరిగి జవసత్వాలు నింపేందుకు ప్రభుత్వం రూ.750 కోట్లకుపైగా నిధులు కేటాయించింది. ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్, తెలంగాణ ఇంక్రిమెంట్ పేరిట ఆర్టీసీ కార్మికులకు ప్రత్యేక ఇంక్రిమెంట్, అంత్యక్రియలకు ఇచ్చే సాయం రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంపు, రిటైర్డ్ ఉద్యోగుల్లో దంపతులిద్దరికి డీలక్స్ బస్సులో ప్రయాణించే ఉచిత బస్పాస్ తదితర చర్యలు చేపట్టింది.
అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీని గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రతి నెలా ఆర్టీసీ కార్మికుల జీతాల కోసం రూ.100 కోట్లు ఇస్తూ సీఎం కేసీఆర్ సంస్థ పరిరక్షణకు పాటుపడతున్నారు. ఆర్టీసీ కార్మికుల ఫీఎఫ్, పీఆర్సీ, ఉద్యోగ భద్రత నియమాల్లో మార్పులు, డీఏ ఇలా అన్నింటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న భరోసా ఆర్టీసీ కార్మికులందరికీ ఉంది.
-థామస్రెడ్డి, టీఎంయూ నాయకుడు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత కార్మికుల ప్రమాద బీమాను రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు ప్రభుత్వం పెంచింది. శాశ్వత అంగవైకల్యం అయినా రూ.5 లక్షల బీమా ఇస్తున్నారు. ఇప్పటివరకు 2,000 మందికి బీమా అందింది. కల్లుదుకాణాల పునరుద్ధరణతో రెండు లక్షల మందికి తిరిగి ఉపాధి లభించింది. 50 ఏండ్లకే గీతకార్మికులకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తున్నది.
తెలంగాణ వచ్చాక గీతకార్మికుల బతుకుల్లో వెలుగులు వచ్చాయి. ప్రమాద బీమా పెరిగింది. హరితహారంలో పెద్దఎత్తున ఈత, తాటి మొక్కలు నాటడం, కల్లు దుకాణాలు తెరవడం, నీరా ప్రాజెక్టు వంటివాటితో గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి.
-అంబాల నారాయణగౌడ్, గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ ఉద్యమంలో పాటలై గర్జించిన 540 మంది కళాకారులకు ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి సాంస్కృతిక సారథులుగా నియమించింది. గడిచిన ఐదేండ్లుగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కళాకారుల సేవలను వినియోగించుకుంటున్నది.
తెలంగాణ రాకముందు ఏదైనా కార్యక్రమం ఉంటేనే డబ్బులు వచ్చేవి. మిగిలిన రోజుల్లో ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉండేది. ప్రత్యేక రాష్ట్రం రాగానే మాకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. నెలకు రూ.24వేల జీతం. సమాజంలో సముచిత గౌరవం. ఒక కళాకారునికి ఇంతకంటే ఏం కావాలి?
-జలజ, సాంస్కృతిక సారథి, హైదరాబాద్
ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల వేతనాలను తెలంగాణ ప్రభుత్వం 150 శాతం పెంచింది. ఇంటర్ వారికి రూ.37,100, డిగ్రీ, పాలిటెక్నిక్ అధ్యాపకులకు రూ.42 వేలకు పెంచారు. దాంతో ఇంటర్లో 3, 598 మంది, డిగ్రీ కాలేజీల్లో 850 మంది, పాలిటెక్నిక్లో 500 మంది అధ్యాపకులకు లబ్ధిచేకూరింది. పది నెలలు మాత్రమే వచ్చే జీతాలను 12 నెలలకు పెంచారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఐదారునెలలకు ఒకసారి వేతనాలు ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మా సమస్యలు గుర్తించి వేతనాలను 150 శాతం పెంచి న్యాయం చేశారు. అప్పులు తెచ్చుకుని కాలం వెళ్లదీసిన నేను ఇప్పుడు ప్రశాంతంగా జీవించగలుగుతున్నాం.
– కే వెంకటేశ్వర్రావు (కాంట్రాక్టు అధ్యాపకుడు, నాగర్కర్నూల్)
తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఐటీ రంగంలో 33 అంతర్జాతీయ దిగ్గజాలు సహా 15వేలకుపైగా పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. దాదాపు 15 లక్షలమందికి ఉపాధి లభించింది. ఇందులో తెలంగాణవారు 40 శాతం ఉన్నారు.
ఐటీ పేరు చెప్పగానే ఒకప్పుడు బెంగళూరు, చన్నై, పుణె నగరాలు గుర్తుకు వచ్చేవి. ఇప్పుడు హైదరాబాద్ వైపు ఇతర రాష్ట్రాలవారు చూస్తున్నారు. ఇక్కడి వాతావరణం, ప్రభుత్వ విధానాలు, శాంతి భద్రతలు పక్కాగా ఉండటం ఐటీ రంగం ఎదుగుదలకు దోహదం చేస్తున్నది.
– పడాల కిరణ్, సాఫ్ట్వేర్ ఉద్యోగి
పేదింట ఆడబిడ్డల పెండ్లికి సాయం చేసేందుకు ప్రభుత్వం ప్రారంభించిన కల్యాణలక్ష్మి పథకం కింద ఇప్పటివరకు 8,34,284 మందికి రూ.6,761.08 కోట్లు ప్రభుత్వం అందించింది. ప్రారంభంలో ఒక్కో ఆడబిడ్డ పెండ్లికి రూ.51వేలు అందించిన ప్రభుత్వం, ప్రస్తుతం రూ.1,00116 ఇస్తున్నది.
నా పెండ్లి చేసేందకు మా నాన్న చాలా కష్టపడ్డారు. రూ.3 లక్షలవరకు తెలిసిన వారి దగ్గర అప్పు తెచ్చారు. ఇంకా రూ.2 లక్షలు కట్టాల్సి ఉండే. ఆ సమయంలో కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష వచ్చినయి. కేసీఆర్ సారు దేవునిలా ఆదుకున్నడు.
– దుద్దుల అఖిల, జఫర్గఢ్, జనగామ జిల్లాక్రీడాకారులకు చేయూత
ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రముఖ క్రీడాకారులకు రూ.10 వేల పెన్షన్ ఇస్తున్నది. సానియామీర్జా, పీవీ సింధు లాంటి అంతర్జాతీయ క్రీడాకారులను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లుగా నిమమించింది. దేశంలోనే అత్యుత్తమ క్రీడా పాలసీని రూపొందించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నది.
ఉమ్మడి రాష్ట్రంలో అంధ క్రికెటర్లను పట్టించుకున్నవారు లేరు. తెలంగాణ రాష్ట్రంలో మా కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేశారు. అంతకుముందు ఏడాదికి ఒకటిరెండు సిరీస్లు ఆడితే, గడిచిన రెండేండ్లుగా ఏటా నాలుగైదు సిరీస్లు ఆడుతున్నాం. రాష్ట్రప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైంది.
– మధు, తెలంగాణ అంధుల క్రికెట్ టీం కెప్టెన్
గత మూడేండ్లలో పర్యాటకశాఖలో 300 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీచేసింది. పదోతరగతి, ఇంటర్ చదివినవారికి సర్వీస్ బాయ్, హెల్పర్ లాంటి ఉద్యోగాలు లభించాయి. ఉన్నత విద్యావంతులు 30 మందికి కార్యాలయాల నిర్వహణ పోస్టుల్లో అవకాశాలు కల్పించారు.
టూరిజం శాఖలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా ఏడాదిన్నర నుంచి పని చేస్తున్నా. డిగ్రీ తో పాటు ఎఫ్అండ్బీలో డిప్లొమా చేశా. ఇప్పుడు బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో పర్చేజ్ అండ్ ఆపరేషన్స్లో పని చేస్తున్నా. నెలకు రూ.25వేల జీతం వస్తుంది. నాకున్న అనుభవానికి, నా చదువుకు తగిన ఉద్యోగం, వేతనం లభిస్తున్నది.
-వై శ్రీనివాస్, టూరిజం ప్లాజా హోటల్, బేగంపేట
గడిచిన ఆరేండ్లలో వైద్యరంగంలో రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించింది. ఆరోగ్యశ్రీ, జర్నలిస్టులు, ఉద్యోగుల హెల్త్ స్కీం, కేసీఆర్ కిట్లు, అమ్మ ఒడి తదితర పథకాలను ప్రభుత్వం అమలుచేస్తున్నది. ప్రభుత్వ దవాఖానలను ఆధునీకరించి వైద్యులు, సిబ్బంది కొరతకు పరిష్కారం చూపింది. కొత్త వైద్యుల నియామకం, పాతవారికి పదోన్నతులు, భోదనా సిబ్బంది రిటైర్మెంట్ వయసు పెంపువంటి చర్యలు చేపట్టింది.
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలను సర్కారు పటిష్టం చేసింది. వైద్యులు, ఇతర సిబ్బంది సమస్యలను పరిష్కరించింది. వైద్యరంగం ఇలాగే ముందుకు వెళ్లాలి. ప్రతి పేద బిడ్డకు మంచి వైద్యం అందించాలి.
– డాక్టర్ పుట్ల శ్రీనివాస్, మెడికల్ జేఏసీ కన్వీనర్