మహబూబ్నగర్లో ప్రారంభించిన సత్యసాయి సేవా సంస్థ
నేటి నుంచి జడ్చర్ల, గద్వాలలోనూ ప్రారంభం
ఎంత మందికైనా సేవలు అందించేందుకు సిద్ధం
మహబూబ్నగర్, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీహార్లోని గయకు చెందిన పృథ్వీ యాదవ్ జడ్చర్లలోని పోలేపల్లి సెజ్లో పనిచేస్తూ మహబూబ్నగర్ పట్టణంలో ఉంటున్నాడు. ఓ అ పార్ట్మెంట్లో నివాసముంటున్న పృథ్వీకి ఇటీవల కరోనా రాగా, హోం ఐసోలేషన్లో ఉంటున్నాడు. అతడికి పట్టణంలో ఎవరితోనూ పెద్దగా పరిచయం లేదు. పైగా కరోనా రావడంతో ఎవరూ దగ్గరకు వ చ్చే పరిస్థితి లేదు. తన ఫ్లాట్లో ఉంటూ నీరసంగా ఉన్నా.. సొంతంగా వంట చేసుకుంటున్నాడు.
గద్వాలకు చెందిన ఇద్దరు వృద్ధ దంపతుల కుమారుడి కుటుంబం ఉద్యోగం కోసం అమెరికా లో స్థిరపడ్డారు. ఇప్పుడు ఈ దంపతులు కొవిడ్ బా రిన పడి హోం క్వారంటైన్లో ఉంటున్నారు. వారికి భోజనం చేసుకోవడం కష్టంగా మారింది.
..ఇలా అనేక మంది హోం క్వారంటైన్లో ఉండి భోజనానికి ఇబ్బంది పడుతున్నారు. ఆర్థికంగా స్థోమత ఉన్నా కనీసం హోటళ్లు కూడా లేక క్వారంటైన్లో ఉన్న వారు పడుతున్న కష్టాలు వర్ణనాతీ తం. ఇలాంటి వారికి సాయం చేసేందుకు స్వచ్ఛంద సంస్థలు మేమున్నామంటూ ముందుకొస్తున్నాయి.
కరోనా రక్కసి విలయతాండవం చేస్తున్నది. మనిషిని మనిషి చూస్తే భయపడే పరిస్థితి ఏర్పడింది. కరోనా సోకిన వారిని దగ్గరి నుంచి చూసేందుకే హడలిపోతున్నారు. అంత్యక్రియలకు రక్తసంబంధీకులే దూరంగా ఉంటున్నారు. కొవిడ్ కారణంగా మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హోం క్వారంటైన్లో ఉన్న వారి పరిస్థితి మరింత దయనీయం. లాక్డౌన్ వల్ల హోటళ్లు తెరవడం లేదు. టిఫిన్ సెంటర్లు ఉదయం 10 గంటలకే మూతపడుతున్నాయి. దీంతో హోం క్వారంటైన్లో ఉన్న వారికి వేళకు ఆహారం లభించడం కష్టంగా మారింది. పలుచోట్ల కుటుంబం మొత్తం క్వారంటైన్లో ఉంటే కనీసం వారికి సేవ చేసే వారు కూడా కరువవుతున్నారు. ఇలాంటి వారికి అండగా ఉండేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. మహబూబ్నగర్ సత్యసాయి సేవా సమితి శనివారం నుంచి పట్టణంలో హోం క్వారంటైన్లో ఉన్న వారందరికీ మధ్యాహ్న భోజనం అందిస్తున్నది. క్వారంటైన్ గడువు ముగిసే వరకు నిత్యం వారి ఇంటికే వెళ్లి ఉచితంగా భోజనం అందిస్తామని ఆ సంస్థ ప్రకటించింది. ఆదివారం నుంచి జడ్చర్ల పట్టణంలోని సత్యసాయి సేవా సంస్థ సైతం క్వారంటైన్లో ఉన్న వారికి ఇంటివద్దకే ఉచితంగా భోజనం అందించేందుకు ముందుకు వచ్చింది.
వాట్సాప్ చేస్తే చాలు..
మహబూబ్నగర్ వెంకటేశ్వర కాలనీలో ఉన్న సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం నుంచి హోం క్వారంటైన్లో ఉన్న వారికి ఉచితంగా మధ్యాహ్నం భోజనం వారి ఇంటి వద్దకు తీసుకువెళ్లి అందిస్తున్నారు. ఇందుకోసం ఆ సంస్థ ప్రతినిధులు ముందుగానే ఓ ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముందురోజు లేదా అదే రోజు ఉదయం 10 గంటల్లోగా 9440440559 నెంబర్కు వాట్సాప్ ద్వారా హోం క్వారంటైన్లో ఉన్న వారి వివరాలు చెబితే.. సత్యసాయి సేవా సమితి సభ్యులు ఆహారాన్ని నేరుగా వారి ఇంటికి తీసుకెళ్లి ఇస్తున్నారు. శనివారం 120 మందికి భోజనం అందించారు. క్వారంటైన్లో ఉన్న వారు తమ పేరు, చిరునామా, పాజిటివ్ రిపోర్ట్, కాంటాక్ట్ నెంబర్ వాట్సాప్ చేస్తే చాలు.. వారి క్వారంటైన్ సమయం ముగిసే వరకు వారి ఇంటికే ఉచితంగా భోజనం పంపిస్తారు.
నేటి నుంచి జడ్చర్లలో..
జడ్చర్ల పట్టణంలోని సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నేటి నుంచి కొవిడ్ క్వారంటైన్లో ఉన్న వారికి మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కొవిడ్ పాజిటివ్ వచ్చి ఇంట్లోనే చికిత్స పొందుతున్న వారికి తమ వంతు సేవ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. 9848773939 నెంబర్కు వాట్సాప్లో వివరాలు పంపిస్తే.. మధ్యాహ్నం, రాత్రి భోజనం అందిస్తామని ఆర్గనైజేషన్ ప్రతినిధులు వివరించారు. పోలేపల్లి సెజ్లో వేలాది మంది ఇతర రాష్ర్టాలకు చెందిన వారు ఉద్యోగాలు చేస్తుంటారు.
వీరిలో చాలా మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చి హోం క్వారంటైన్లో ఉంటున్నారు. స్థానికంగా ఎలాంటి పరిచయాలు లేని ఇలాంటి వారికి ఆపద సమయంలో ఆహారం అందిస్తే అది భగవంతునికి సేవ చేసినట్లుగా సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ సభ్యులు అంటున్నారు. లక్షణాలు ఉండి క్వారంటైన్లో ఉన్న వారికి కూడా భోజనం అందిస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ముందుకొచ్చిన కుటుంబం..
గద్వాల పట్టణానికి చెందిన ఇనుగూరు వెంకటేశ్వర్లు వ్యాపారి. కొవిడ్ నేపథ్యంలో దేశమంతా ప్రజలు పడుతున్న బాధలు ఆయనను, కుటుంబ సభ్యులను కదిలించాయి. హైదరాబాద్, బెంగళూరు, పూణె, ముంబయి, చెన్నై వంటి నగరాలతోపాటు విదేశాల్లో స్థిరపడిన వారి తల్లిదండ్రులు స్థానికంగా కొవిడ్ బారిన పడుతున్నారు. చూసుకునేందుకు కన్నబిడ్డలు దగ్గర లేక ఆ వృద్ధులు పడే బాధలు ఎన్నో. కుటుంబంలోని అందరూ కొవిడ్ బారిన పడుతున్న సంఘటనలూ ఉన్నాయి. ఇలాంటి వారికి తమ వంతుగా సాయం చేసేందుకు వెంకటేశ్వర్లు, ఆయన భార్య పుష్పలత, కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. గద్వాల పట్టణ పరిధిలో కొవిడ్ బారిన పడి హోం క్వారంటైన్లో ఉన్న వారు 9440645823, 9603832711, 9676958123కు ఫోన్ చేసి సమాచారం ఇస్తే.. తమ కుటుంబ సభ్యులే స్వయంగా భోజనం వండి మధ్యాహ్నం, రాత్రి వారి ఇంటి వద్దకే వెళ్లి ఉచితంగా భోజనం అందిస్తామని తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని సేవాభావం ఉన్న వారు మరింత మంది ముందుకు రావాలని ఆశిద్దాం.
సమాచారమిస్తే భోజనం పంపిస్తాం..
శనివారం నుంచి ఉచిత భోజనం అందించే సేవను ప్రారంభించాం. తొలి రోజు 120 మందికి భోజన సదుపాయం కల్పించామనే సంతోషం దక్కింది. సత్యసాయి మందిరంలో మా సమితి సభ్యులే స్వయంగా భోజనం సిద్ధం చేసి వాట్సాప్ ద్వారా వివరాలు అందించిన వారందరికీ ఇంటి వద్దకు వెళ్లి భోజనం అందించాం. క్వారంటైన్లో ఉన్న వారికి మా వంతుగా సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నాం. క్వారంటైన్ ముగిసే వరకు భోజనం అందిస్తాం.