హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): పది రూపాయలు మొదలు.. పెద్ద పెద్ద లావాదేవీల వరకు అంతా ఆన్లైన్ పేమెంట్లే జరుగుతున్నాయి. కరోనా భయంతో చిరు వ్యాపారులు సైతం నోట్లకు బదులు ఆన్లైన్ పేమెంట్ చేయాలని వినియోగదారులను కోరుతున్నారు. ఫలితంగా యూపీఐ లావాదేవీల్లో 288 శాతం పెరుగుదల కనిపించింది. యూపీఐ ద్వారా చేసే ఖర్చులు 2019-20లో ఏకంగా 330 శాతం పెరిగాయి. ఆన్లైన్ గేమింగ్, కామర్స్, పేమెంట్ ఫ్లాట్ఫామ్లు కూడా ఏడాదిలో 100 శాతం వృద్ధి సాధించాయి. ఓటీటీల్లో 144 శాతం, గేమింగ్లో 100శాతం, రిటైల్, ఈ-కామర్స్ విభాగంలో 106 శాతం వృద్ధి నమోదైనట్లు పేయూ నివేదిక తెలిపింది.
ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యత పెరగడంతో ఎడ్టెక్ విభాగంలో లావాదేవీలు 78 శాతం వృద్ధి సాధించాయి. ఖర్చులు 44 శాతం పెరిగాయి. కరోనా ప్రభావంతో ట్రావెల్ అండ్ టూరిజం విభాగంలో గతంతో పోల్చితే వృద్ధి పడిపోయింది. అటు.. డిజిటల్ పేమెంట్లలో దేశంలోనే ఈశాన్య రాష్ర్టాలు అగ్రభాగంలో నిలుస్తున్నాయి. పేయూ నివేదిక ప్రకారం.. నాగాలాండ్లో 93 శాతం, మేఘాలయ 82 శాతం, మణిపూర్ 74 శాతం, అరుణాచల్ప్రదేశ్ 66 శాతం, త్రిపురలో 63 శాతం మంది యూపీఐ ద్వారా నగదు చెల్లింపులను నిర్వహిస్తున్నారు. తెలంగాణలో డిజిటల్ పేమెంట్లు 52శాతంగా ఉన్నాయి.