పెట్రో ధరలు పైసా, పైసా పెరిగి సెంచరీ కొడుతున్నాయి. పెట్రోల్ వేగంగా సెంచరీ కొట్టి కొత్త రికార్డులు సృష్టిస్తుంటే.. నేనేం తక్కువ అన్నట్టు డీజిల్ కూడా సెంచరీ కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నది. ప్రస్తుతం సెంచరీకి 36 పైసల దూరంలో ఉన్న డీజిల్ నేడో రేపో వంద మార్కును దాటడం ఖాయంగా కనిపిస్తున్నది. దీని ప్రభావం వ్యవసాయం, నిత్యావసరాలపై పడే అవకాశం కనిపిస్తున్నది. కరోనా, పెట్రో ధరల పెంపుతో ఇప్పటికే నడ్డివిరిగిన సామాన్యుడిపై నిత్యావసరాల ధరల పిడుగు కూడా పడే సూచనలు ఉన్నాయి.
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): పెట్రో ధరలు రోజురోజుకూ ఆల్టైం హైకి చేరుతున్నాయి. రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఇప్పటికే సెంచరీ దాటగా, డీజిల్ కూడా సెంచరీకి దగ్గరగా వచ్చింది. తెలంగాణ లో డీజిల్ ధర అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో లీటరుకు రూ.99.64గా ఉన్నది. ఆ తర్వాత ఆదిలాబాద్ జిల్లాలో రూ.99.61, హైదరాబాద్లో రూ.97.78గా ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సరాసరి రూ.97.50 నుంచి రూ.99 వరకు ఉండటం గమనార్హం. కామారెడ్డి జిల్లాలో ఏడాదిన్నర కాలంలోనే లీటరు డీజిల్పై ఏకంగా రూ. 24.32 పెరిగింది. 2020 జనవరి 1న ఆ జిల్లాలో డీజిల్ ధర రూ.75.32 ఉండగా, ఇప్పుడది రూ.99.64 అయ్యింది. పెట్రోల్ విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో రూ.107.16, ఆదిలాబాద్లో 107.12, హైదరాబాద్లో రూ.105.15గా ఉన్నది. పెట్రో ధరల పెంపు సామాన్యుడి జీవితంపై పెను ప్రభావం చూపుతున్నది. ఇప్పటికే కరోనాతో తల్లడిల్లుతున్న జనాలు రోజురోజుకు పెరుగుతున్న పెట్రో ధరలతో నలిగిపోతున్నారు. డీజిల్ ధరల పెంపుతో సరుకు రవాణా ఖర్చులు పెరిగి వ్యవసాయం, నిత్యావసరాలపై ప్రభావంచూపే అవకాశం ఉన్నది. పంట పెట్టుబడి ఖర్చులు తడిసి మోపెడవుతుండటంతో రైతులు వ్యవసాయం చేయలేని పరిస్థితి నెలకొన్నది. ఆ ప్రభావం రాష్ట్ర, దేశ ఆర్థిక వ్యవస్థపైనా పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఏడేండ్లలో పెట్రోల్పై రూ.34.96, డీజిల్పై రూ.39.67 పెంపు
కేంద్రంలోని బీజేపీ సర్కారు పెట్రో ధరల పెంపులో కొత్త రికార్డులు సృష్టి స్తూ, వాటిని తనే బద్దలు కొడుతున్నది. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కువగా పెరుగుదలే నమోదైంది. 2014 నవంబర్లో హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.70.19 ఉండగా, డీజిల్ ధర రూ. 58.11 ఉన్నది. ఏడేండ్లలో పెట్రోల్ ధర లీటరుకు రూ.34.96 పెరుగగా, డీజిల్ ధర రూ.39.67 పెరిగింది. 2017, మే 1 నాటికి పెట్రోల్ ధర రూ.72.68కి చేరింది. 2018 మే 1 నాటికి రూ.79.04 చేరగా, అదే ఏడాది అక్టోబర్లో రూ.88.77గా నమోదైంది. 2019 మార్చి నాటికి రూ.76.17కు తగ్గినా 2020 జూలై 1 వచ్చేసరికి లీటరు పెట్రోల్ రూ.83.49కి చేరింది. ఈ ఏడాది జూలై 1 నాటికి రికార్డు స్థాయిలో రూ.102.69కు చేరింది. ఈ ఒక్క ఏడాదిలోనే పెట్రోల్ ధర దాదాపు రూ.20 పెరుగటం గమనార్హం.