హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రైవేటు దవాఖానలు డెంగ్యూ, ప్లేట్లెట్స్ పేరిట దోచుకుంటే సహించేది లేదని ప్రజారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు హెచ్చరించారు. కొన్ని ప్రైవేటు దవాఖానాలు డెంగ్యూ పేరిట దోచుకుంటున్నట్టు ఇప్పటికే ఫిర్యాదులు అందాయని చెప్పారు. వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం ఆయన కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్లేట్లెట్స్ సంఖ్య 20 వేల కంటే తక్కువకు పడిపోతేనే ప్రమాదకరమని, లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రైవేట్ దవాఖానాల మోసాలపై 102 కాల్ సెంటర్ లేదా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధి కారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
22 ప్రభుత్వ దవాఖానల్లో ప్లేట్లెట్ యంత్రాలు ఉన్నాయని, ప్రైవేట్కు వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దని పేర్కొన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్నవాటిలో 95 శాతం వైరల్ జ్వరాలేనని, నెలాఖరు తర్వాత అవి తగ్గుముఖం పడతాయని చెప్పారు. ఇప్పటివరకు మూడువేల డెంగ్యూ, 613 మలేరియా కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మలేరియా కేసులు, హైదరాబాద్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో డెంగ్యూ కేసులు ఎక్కువగా ఉన్నాయని వివరించారు.
బడికి పంపేందుకు భయం వద్దు
రాష్ట్రంలో హెర్డ్ ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్, కొత్త వేరియంట్ రాకపోవడం తదితర కారణాల వల్ల వైరస్ ఉధృతి తగ్గిందని, ఐటీ కంపెనీలు ఆఫీసులోనే పని విధానా న్ని ప్రారంభించవచ్చునని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇప్పట్లో థర్డ్ వేవ్ రాకపోవచ్చని చెప్పారు. రాష్ట్రంలో విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటికీ కరోనా కేసుల్లో పెరుగుదల లేదని, క్లస్ట ర్ కేసులు నమోదు కాలేదని చెప్పారు. పిల్లలను బడికి పంపేందుకు తల్లిదండ్రులు భయపడొద్ద న్నారు. 3,200 పాఠశాలల్లో 1.15 లక్షల మంది విద్యార్థులకు కొవిడ్ టెస్టులు చేయగా, 55 మం దికి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. సర్కార్ బడుల్ల్లో 40-50% హాజరు, ప్రైవేటు స్కూళ్లలో 20-25% హాజరు ఉన్నదని వెల్లడించారు.