పల్లెప్రగతి పై ప్రత్యేక నజర్
పనుల పర్యవేక్షణకు యాప్
పంచాయతీ పనుల్లో పారదర్శకత
ఎప్పటికప్పడు ఆన్లైన్లో వివరాల నమోదు
మెదక్రూరల్, మార్చి 20 : పల్లెప్రగతి పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామాల్లో జరుగుతున్న రోజు రోజు పనుల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తెచ్చారు. ఎంపీవో, ఎంపీడీవో, జిల్లా పంచాయతీ అధికారులను ఇందులో భాగస్వాములయ్యారు. రోజు వారీగా జరుగుతున్న అభివృద్ధ్ది పనులను పంచాయతీ కార్యదర్శులు యాప్లో నమోదు చేస్తారు.
ఎక్కడి నుంచైనా పర్యవేక్షణ
పల్లెలో జరిగే అభివృద్ధి పనుల వివరాలు యాప్ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. పనులను పర్యవేక్షించడానికి నేరుగా గ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. జిల్లా స్థాయి అధికారులు ఎక్కడి నుంచి అయినా పనులను పరిశీలించే అవకాశం ఉంది. గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారో కార్యదర్శులు యాప్లో అప్లోడ్ చేస్తారు. వాటిని సంబంధిత ఉన్నతాధికారులు లాగిన్ చేసి పర్యవేక్షిస్తారు.
యాప్ అంశాలు ఇవే..
గ్రామంలోని నివాస గృహాలు, అంతర్గత రోడ్లు, మురుగు కాల్వల వివరాలు నమోదు చేయాలి. రోజు ఎన్ని ఇండ్ల నుంచి చెత్త సేకరించారు, ఎన్ని మురుగు కాల్వలు శుభ్రం చేశారని తెలపాలి. చెత్త రిక్షాల పనితీరు, డంపింగ్ యార్డుకి తరలిస్తున్న ప్రక్రియను వివరించాలి. హరితహారం నర్సరీ నిర్వహణ, గ్రామంలోని ఖాళీ స్థలాలు, రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల పర్యవేక్షణ ఎలా ఉందనేది చెప్పాలి. కం పోస్టు షెడ్డులో చెత్తను వేరు చేస్తున్న విధానం, ఎరువు తయారీ పక్రియలను నమోదు చేయాలి. వైకుంఠధామాల వినియోగం, ఎదురవుతున్న సమస్యలను యాప్లో నిక్షిప్తం చేయాలి.పన్నుల మసూళ్లు, నివేదికలు ధ్రువపత్రాలు జారీ, ఆదాయం, వ్యయం, వేతనాల చెల్లింపులు, ఉపాధిహామీ పనుల వివరాలను నమోదు చేస్తున్నారు.
కార్యదర్శులకు నిధులు
యాప్ వాడకం పై పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. నిర్వహణ ఖర్చులు కోసం పంచాయతీ నిధు ల నుంచి ప్రతి నెలా రూ. 500 కార్యదర్శులకు చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.